భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాజ్భవన్లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
కాగా, 1963, ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్.. భారత క్రికెట్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత.. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఒకసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. ఆతర్వాత.. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇదిలావుంటే, అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్రెడ్డి.. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గురువారం రాత్రి సమాచారం అందజేశారు. అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం సాఫీగా సాగిపోయింది.
విమర్శల మధ్యే..
మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ను తీసుకోవడం పట్ల బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా చూడాలని అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత రెండేళ్లుగా ఇవ్వని మంత్రి పదవి ఇప్పుడు ఇస్తున్నారంటే.. అది ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని ఆరోపించారు. అయితే.. ఇన్ని విమర్శలను కూడా పక్కన పెట్టిన కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రి పీఠం కట్టబెట్టింది.