గత కొన్నేళ్లుగా ఎనర్జిటిక్ రామ్ సినిమా మీద ఎక్కువ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్న సినిమా ఆంధ్రకింగ్ తాలూకానే . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నవంబర్ 27 విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ దీని కోసం పెద్ద బడ్జెట్ పెట్టింది. ఇవాళ కర్నూలులో ట్రైలర్ లాంచ్ తో పాటు గ్రాండ్ డ్రోన్ షో నిర్వహించారు. వేలాది అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో రెండున్నర నిమిషాల వీడియో ద్వారా కథేంటో చెప్పేశారు. ప్రీమియర్ల కోసం హీరో హీరోయిన్ ప్రత్యేకంగా యుఎస్ వెళ్ళబోతున్నారంటేనే కంటెంట్ మీద నమ్మకం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు.
సగటు మధ్యతరగతి మాములు యువకుడు సాగర్ (రామ్). అతనికి స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర) అంటే పిచ్చి. మొదటి రోజు మొదటి ఆట చూడటమే కాదు రిలీజ్ ని ఒక పండగలా జరుపుకోవడం అతనికున్న అలవాటు. ఇష్టపడిన అమ్మాయి మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే ఒక సందర్భంలో సాగర్ ని థియేటర్ యజమాని ఘోరంగా అవమానిస్తాడు. దీంతో సాగర్ బీచ్ ఒడ్డున స్వంతంగా టెంట్ హాలు కట్టుకుంటాడు.ఇతని తాపత్రయం తెలుసుకున్న సూర్య ఎలాగైనా సాగర్ ని కలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి,
దర్శకుడు మహేష్ బాబు ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఫ్యాన్, అభిమాని మధ్య ఎమోషన్ తీసుకుని ఇలాంటి స్టోరీ అల్లడం ఖచ్చితంగా కొత్త ప్రయత్నమే. దానికి తగ్గట్టు విజువల్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, వివేక్ మెర్విన్ సంగీతం వగైరాలు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత ఉపేంద్ర తెలుగులో ఫుల్ లెన్త్ రోల్ చేయడం బాగుంది. అఖండ 2కి సరిగ్గా వారం ముందు వస్తున్న ఆంధ్రకింగ్ తాలూకా నవంబర్ నెలని బ్లాక్ బస్టర్ తో ముగిస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. అదే జరిగితే రామ్ మళ్ళీ బ్యాక్ టు ది ఫామ్ అనుకోవచ్చు. మహేష్ బాబు ఖాతాలో మరో హిట్టు చేరుతుంది.