ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కీలకమైన తిరుమల శ్రీవారి లడ్డూ అంశంపై సభలో చర్చ పెడుతుంటే.. జగన్ అదేమీ పట్టనట్టుగా.. తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోతున్నారు. దీంతో అసలు ఆయనకు బాధ్యతలేదా? లేక.. మరేంటి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో వచ్చి.. ఆయనను పిలుస్తారని భావిస్తున్నారా? అనేది కూడా చర్చకు వస్తోంది. ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ.. వైసీపీని బొట్టు పెట్టి పిలవాలా? అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఓటు వేసి గెలిపించిన తర్వాత.. సభకు రావాల్సిన కనీస బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుందన్నారు. గతంలో తాము అనేక అవమానాలకు గురైనప్పటికీ.. అటు మండలికి, ఇటు శాసన సభకు కూడా వచ్చామని తెలిపారు. కానీ.. ఇప్పుడు వైసీపీ సభ్యులు అసలు సభకే రాకపోవడం దారుణమన్నారు.
ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. వైసీపీ సభ్యులకు తగిన విధంగా ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ఎవరూ బొట్టు పెట్టి వారిని ఆహ్వానించరని.. సభ జరుగుతున్నప్పుడు రావడం వారి కనీస కర్తవ్యమని చెప్పారు.
ఇక, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసుకు సంబంధించిన వాస్తవాలను, దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని నారా లోకేష్ స్ఫష్టం చేశారు. కోట్ల మంది భక్తులు పూజించే దేవ దేవుడిని కూడా వైసీపీ రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు.
శ్రీవారి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేపట్టడం ఆక్షేపణీయమని లోకేష్ విమర్శించారు. అనంతరం.. ఆయన సభలోకి వెళ్లారు. ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్ సహా.. పాఠశాలలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఉగాది(మార్చి 19) నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని లోకేష్ తెలిపారు. ఈ జాబ్ క్యాలెండర్లోనే డీఎస్సీ పోస్టులు కూడా ప్రకటిస్తామన్నా రు. రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల పరిస్థితి బాగానే ఉందన్నారు.