వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు.
ప్రస్తుతం అక్రమ ఆస్తుల కేసును హైదరాబాదులోని సిబిఐ కోర్టు విచారణ సాగిస్తోంది. అయితే, 2019 ఎన్నికలకు ముందు నుంచి కోర్టుకు వెళ్లకుండా ఉన్న జగన్ దాదాపు 7 సంవత్సరాల తర్వాత వచ్చే నెల 14న కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తాజాగా జరిగిన విచారణలో సిబీఐ కోర్టు మరోసారి జగన్ కు ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఇటీవల జగన్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో పర్యటించారు. అయితే ఆయన లండన్ కు వెళ్లడానికి ముందు సిబిఐ అనుమతి తీసుకున్నారు. కానీ, ఈ క్రమంలో ఆయన తమకు వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారని పేర్కొంటూ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని విచారించిన సిబిఐ కోర్టు ఈ విషయం ముగిసిపోయిన అంశమని. లండన్ వెళ్లిన జగన్ తిరిగి వచ్చేసారని తెలిపింది. కాబట్టి ఈ కేసుతో పనిలేదని పేర్కొంది. అయితే, ఇదే సమయంలో నవంబర్ 14న జగన్ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
అక్రమ ఆస్తుల కేసులు విచారణ జరుగుతున్న సిబిఐ కోర్టుకు దాదాపు ఏడు సంవత్సరాలుగా జగన్ రాకపోవడాన్ని ఇటీవల సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఆయన కోర్టుకు రావాల్సిందేనని వారు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో గత నెలలో సిబీఐ కోర్టు జగన్ కు ఈ మేరకు ఆదేశించింది. తాజాగా మరోసారి గుర్తు చేసింది.
సో దీంతో జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదని సిబిఐ న్యాయవాదులు చెబుతున్నారు. కానీ, మరోవైపు వైసీపీ తరఫున న్యాయవాదులు మాత్రం దీనిపై నిర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. తమకు మరో అవకాశం ఉందని అంటున్నారు.