కూలీ విడుదల ముందు వరకు రాజమౌళి రేంజ్ లో హైప్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు కేవలం ఒక్క ఫ్లాప్ మొత్తం తలకిందులు చేసేసింది. అయిదు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసినా, అంచనాలు అందుకోలేకపోవడంతో కమర్షియల్ లెక్కల్లో అపజయాల లిస్టులోకి చేరిపోయింది. ఒకవేళ కూలీ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈపాటికి రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబో మల్టీస్టారర్ పనులు మొదలయ్యేవని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడా ఛాన్స్ ని నెల్సన్ దిలీప్ కుమార్ ఎగరేసుకుని పోయాడని చెన్నై టాక్. ఇంకోసారి వర్క్ చేద్దామని లోకేష్ తో చెప్పిన రజని ఏకంగా రిటైర్ మెంట్ ప్లాన్ లో ఉన్నారట.
ఇదో దెబ్బ అయితే అమీర్ ఖాన్ తో సెట్ చేసుకున్న ప్యాన్ ఇండియా సూపర్ హీరో మూవీ కూడా ఆగిపోవడం లోకేష్ కనగరాజ్ గాయాన్ని మరింత పెద్దది చేస్తోంది. ఎక్కడా దాని గురించి ఊసు వినిపించడం లేదు. కూలిలో దాహా క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో ఆ క్యామియో కాస్తా కామెడీకి ఎక్కువ విలనీకి తక్కువగా మిగిలిపోయింది. ఇక కార్తీ ఎప్పుడు అడిగినా సిద్ధంగా ఉన్న ఖైదీ 2ని సైతం లోకేష్ వెంటనే మొదలుపెట్టే పరిస్థితిలో లేడట. బడ్జెట్ పరంగా తను డిమాండ్ చేస్తున్న మొత్తాన్ని భరించే స్థితిలో నిర్మాత లేకపోవడమే దానికి కారణమంటూ కోలీవుడ్ గుసగుస.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ – ప్రభాస్ కలయికలో లోకేష్ కనగరాజ్ ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా తెరకెక్కిస్తాడనే ప్రచారం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇందులో నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఊరికే ఆయన పేరుని లైమ్ లైట్ లో ఉంచడం కోసం పదే పదే ఇలాంటి పుకార్లు కొందరు పుట్టిస్తున్నారు తప్ప ప్రభాస్ కున్న కమిట్ మెంట్స్ దృష్ట్యా ఇప్పటికిప్పుడు మల్టీస్టారర్లు చేసే పరిస్థితిలో లేడు. సరే ఫ్లాపులు అందరికీ వస్తాయి కానీ ముందైతే లోకేష్ కనగరాజ్ ఏదో ఒక సినిమాను లాక్ చేసుకుని అనౌన్స్ మెంట్ ఇస్తే తప్ప అభిమానులు, మూవీ లవర్స్ లో ఈ కన్ఫ్యూజన్ ఆగదు. లేదంటే పెరుగుతూనే పోతుంది.