ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్మ్యాన్, రిచెస్ట్ మ్యాన్ ఎవ్వరు అంటే తడుముకోకుండా ముకేశ్ అంబాని పేరు చెప్పేస్తారు ఎవ్వరైనా. ధీరూబాయి అంబానీ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన పెద్ద కొడుకైన ముకేశ్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లారు. లక్షల కోట్లకు అధిపతిగా కొనసాగుతున్నారు.
తమ్ముడు అనిల్ అంబానీ ఒక ఫెయిల్యూర్ బిజినెస్మ్యాన్గా పేరు తెచ్చుకుని అప్రతిష్ట పాలైతే.. ముకేశ్ మాత్రం ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు సైతం పెద్ద ఎత్తునే చేస్తుంటారు. ముకేశ్కు భక్తీ ఎక్కువే. ఆయన ఒక్క రోజులో.. కొన్ని గంటల వ్యవధిలో మూడు ఆలయాలను సందర్శించి భారీ విరాళాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన ముకేశ్ అంబానీ ఏకంగా రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు. తిరుమల అన్నదానం ట్రస్టుకు ఆయన ఈ విరాళాన్ని అందించారు. రోజూ 2 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా కొత్త వంటశాల నిర్మించి, దాని నిర్వహణకు గాను గాను ఆయన ఈ విరాళం ప్రకటించారు. ప్రస్తుతం తిరుమలలో వెంగమాంబ పేరుతో నిత్యాన్నదాన సత్రం భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు రాజస్థాన్లోని నాథ్ ద్వారా గుడిని కూడా సందర్శించిన ముకేశ్.. ఆ ఆలయ ట్రస్టుకు రూ.50 కోట్ల విరాళం అందించారు. ఇంకోవైపు కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించిన ముకేశ్.. దాని ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రికి తొలి విడతగా రూ.15 కోట్ల విరాళం ఇచ్చారు. భవిష్యత్తుగా మరిన్ని నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇలా ముకేశ్ ఒక్క రోజే కొన్ని గంటల వ్యవధిలో మూడు ఆలయాలను సందర్శించి రూ.165 కోట్ల భారీ విరాళాలు అందజేయడం చర్చనీయాంశంగా మారింది.