మొంథా తుఫాను.. పలు ప్రభావిత జిల్లాల ప్రజలకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కానీ, ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్లకు కూడా నిద్రలేకుండా చేస్తోందన్న విషయం చాలా మందికి తెలియదు. గత రెండు రోజులుగా సీఎం చంద్రబాబు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉదయం 10 నుంచి రాత్రి 11-12 గంటల వరకు గడిపారు. మంగళవారం రాత్రి అయితే.. ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత.. కూడా ఆర్టీజీఎస్లోనే ఉన్నారు.
తీవ్ర తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంలోనే కూర్చుని మంగళవారం రాత్రి వరకు మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తీవ్ర తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి ఐదారుగురితో ఓ బృందాన్ని పంపించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఉంటే… ప్రజలకు భరోసా కలుగుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. భారీ వర్షాల కారణంగా కాల్వలు, చెరువులు రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు.
క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయడంతోపాటు.. టెక్నాలజీని వినియోగించుకున్నారు. శాఖల వారీగా నష్టం అంచనా నివేదికలను సిద్దం చేయాలని కూడా రాత్రే ఆదేశించడం గమనార్హం. వర్షాల ప్రభావం తగ్గగానే యుద్ద ప్రాతిపదికన విద్యుత్తును పునరుద్దరించాలని సూచించారు. జిల్లాల్లోని పరిస్థితిని చంద్రబాబుకు ఫోన్ ద్వారా మంత్రులు వివరించారు. ఇదంతా.. తుఫాను ప్రభావ సమయంలోనే జరగడం విశేషం. వాస్తవానికి తుఫాను ప్రభావం తగ్గాక సమీక్షిస్తారు. కానీ, బాబు అలా కాకుండా.. తుఫాను సమయంలోనే అన్నీ సేకరించారు.
ఇక, తీవ్ర తుఫాను తీవ్రతపై అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి నారా లోకేష్ మంగళవారం రాత్రంతా ఉన్నారు. బుధవారం(ఈ రోజు ) ఉదయం 7 గంటలకు కూడా ఆయన జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు ఆదేశించారు. గతరాత్రి ఆయ ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేసిన ఆయన గంట గంటకు పరిస్థితిని తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయని.. వాటి ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.