అమరావతి : దివంగత, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, నేతలు కంచర్ల శ్రీకాంత్, ఉండవల్లి శ్రీదేవి, పిల్లి మాణిక్యాలరావు, బాలకోటయ్య తదితరులతో కలిసి బాబూ జగ్గజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ అందించిన సేవల్ని కొనియాడారు చంద్రబాబు నాయుడు దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించటంతో పాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించారని కీర్తించారు సీఎం.
పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఎన్నో సంస్కరణలు అమలు చేసిన మహనీయుడని పేర్కొన్నారు. బాబూ జగజ్జీవన్ రామ్ స్పూర్తితోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. ఎస్సీల్లోని అన్ని కులాలకూ సమాన అవకాశాలు దక్కాలనే వర్గీకరణ చేశామని అన్నారు. దళిత వర్గాలకు న్యాయం జరగాలన్నదే టీడీపీ విధానం అని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఎస్సీల అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో జగజ్జీవన్ రామ్ రాష్ట్ర మంతటా పర్యటించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్తో జగజ్జీవన్ రామ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు.
బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఆయనకు నివాళి అర్పించామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఎస్సీ వర్గీకరణతో అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేశాం అన్నారు. ఎస్సీల్లోని అన్ని కులాలకూ సమ న్యాయం జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. దళితుల సాధికారిత కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రకటించారు.
The post జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రశంసనీయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రశంసనీయం
Categories: