కర్నూలు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి లభ్యమవుతోందని, యువత వాటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కంట్రోల్ చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తన స్వంత ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రచారం చేసుకోవడం తప్పా రాష్ట్ర బాగోగులు, ప్రజల గురించి పట్టించు కోవడం లేదన్నారు. ప్రచార ఆర్భాటంపై ఉన్నంత శ్రద్ద సమస్యల పరిష్కారంపై ఉండడం లేదంటూ మండిపడ్డారు. అవగాహనపై చేసేది తూతూ మంత్రపు ప్రచారమేనని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఏరులై పారుతున్నాయని చెప్పేందుకు మదనపల్లిలో చోటు చేసుకున్న 7 ఏళ్ల బాలిక హత్యాచార, హత్య ఘటనే నిదర్శనం అన్నారు. గంజాయి మత్తులో ముక్కు పచ్చలారని పసిబిడ్డపై జరిగిన పైశాచికం దారుణమన్నారు. అసలు మనుషులు ఎటు పోతున్నారో అర్థం కావడం లేదన్నారు.
రాను రాను మహిళలు బతకాలంటే జంకే పరిస్థితి నెలకొందన్నారు. చిన్నారులకు సైతం భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ దారుణ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్ర విచారం వ్యక్తం చేసున్నామన్నారు షర్మిలా రెడ్డి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు మళ్లీ పునరావృతం కాకుండా ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యహరించాలని, నిరంతరం నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. బుధవారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో పాల్గొని ప్రసంగించారు షర్మిలా రెడ్డి.
The post డ్రగ్స్, గంజాయిపై కంట్రోల్ తప్పిన సర్కార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
డ్రగ్స్, గంజాయిపై కంట్రోల్ తప్పిన సర్కార్
Categories: