తెలంగాణలో దీపావళి వేళ తీవ్ర సంచలన ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఈ కాల్పులు జరిపినట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఎన్ కౌంటర్ ఘటన రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన నేపథ్యంలో డీజీపీ స్పందించారు. నిజామాబాద్లోని ఆసుపత్రిలో రియాజ్ను వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లామన్నారు.
అయితే.. ఈ సమయంలో పక్కనే ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ నుంచి రియాజ్ తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడని డీజీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసుల నుంచి అతను తప్పించు కుని పారిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపినట్టు డీజీపీ తెలిపారు. రియాజ్కు నేర చరిత్ర ఉందన్నారు. ఆదివారం.. మరో వ్యక్తిపై కూడా అతను హత్యాయత్నం చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉండకపోతే.. మరింత మంది ప్రాణాలకు ముప్పు వచ్చి ఉండేదని డీజీపీ వ్యాఖ్యానించారు.
ఎవరీ రియాజ్..
నిజామాబాద్ పట్టణానికి చెందిన మైనారిటీ యువకుడు రియాజ్ జులాయిగా తిరిగేవాడని పోలీసులు తెలిపారు. గతంలోనే అతనిపై 40కి పైగా కేసులు ఉన్నాయి. వాహనాల దొంగతనం కేసులో కొందరు వ్యక్తులను పట్టుకునేందుకు వచ్చిన సీసీ ఎస్ పోలీసులపై రియాజ్ ఈ నెల 17న దాడి చేశాడు. అతనిని కూడా అనుమానించి పోలీసులు పట్టుకుని వెళ్తున్న క్రమంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్పై రియాజ్ దాడి చేసి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.
ఈ ఘటన అనంతరం పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకునే క్రమంలో అప్పుడు కూడా వారిపై తిరగబడ్డాడు. అయితే.. అతి కష్టం మీద రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి స్టేషన్లోనే ఉంచారు. సోమవారం ఉదయం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం.. కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే..ఈ క్రమంలో రియాజ్.. పోలీసు తుపాకీని అపహరించి వారిపైనే కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.