జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య నెలకొన్న వివాదం ఆయా పార్టీల అధినేతల వద్దకు చేరింది.
పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో సీఎం నారా చంద్రబాబునాయుడు ఫొటో లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జీ ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేయగా… అక్కడే ఉన్న జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు వాదులాటతో పాటు తోపుటాలకు దిగాయి. ఈ విషయంలో వర్మదే తప్పు అని తాజాగా చంద్రబాబు తేల్చిపారేశారు.
ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ సందర్భంగా పిఠాపురంలో ఏం జరిగిందన్న విషయంపై చంద్రబాబు వివరాలు సేకరించారు. ఫ్లెక్సీలో తన ఫొటో లేకుంటే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి చేరవేయాలి గానీ…బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం.
ఓ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మకు ఈ విషయం తెలియదా? అని కూడా చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగితే… పార్టీ కేడర్ కు ఎలాంటి సందేశం వెళుతుందన్న విషయం కూడా వర్మకు తెలియదా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారని, ఈ కారణంగా పిఠాపురంలో చీమ చిటుక్కుమన్నా… అంతా అటువైపే చూస్తారని కూడా చంద్రబాబు అన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వర్మ నడచుకునేలా చూడాలని ఆయన పల్లాకు సూచించారట.
అయినా కార్యకర్తల ముందు నేతలు వాదులాటకు దిగడమేమిటని కూడా చంద్రబాబు ప్రశ్నించారట. మొత్తంగా ఈ వ్యవహారంలో జనసేన నేతల విషయం ఎలా ఉన్నా… వర్మదే తప్పన్నట్లుగా చంద్రబాబు తేల్చేశారు. విషయం ఏదైనా పార్టీ అధిష్ఠానానికి చేరవేయడమనే నియమాన్ని అందరూ పాటించేలా చూడాలని కూడా ఆయన పల్లాకు సూచించారట.