hyderabadupdates.com movies పోల‌వ‌రంలో జ‌గ‌న్‌కు ముడుపులు.. జ్యోతుల సంచ‌ల‌నం..!

పోల‌వ‌రంలో జ‌గ‌న్‌కు ముడుపులు.. జ్యోతుల సంచ‌ల‌నం..!

పోలవరం ప్రాజెక్టును తన తండ్రి మాజీ సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని దీనిని తాను ప్రాణప్రదంగా భావిస్తున్నామని వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనూ పోలవరం ప్రాజెక్టుపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా నిర్మిస్తున్నామని కూడా చెప్పారు. అంతేకాదు 2014 19 మధ్య కాలంలో టిడిపి ఇచ్చిన కాంట్రాక్టు రద్దుచేసి రివర్స్ టెండర్లను పిలిచి పోలవరం ప్రాజెక్టుకు మేలు చేస్తున్నామని నిధులు మిగులుస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు.

ఇది రాజకీయంగానే కాదు ప్రాజెక్టు పరంగా కూడా తమకు మేలు చేస్తుందని వైసిపి నాయకులు అంచనా వేసుకున్నారు. ఇక 2022లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని నీళ్లు కూడా ఇచ్చేస్తామని అప్పట్లో జల‌ వనరుల శాఖ మంత్రులుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా అంబటి రాంబాబులు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇది సాకారం కాలేదు. పోలవరం ప్రాజెక్టులో గైడ్ బండ్ వరద నీటికి కొట్టుకుని కూడా పోయింది. తద్వారా మరింత భారం పెరిగింది. ఈ పరిణామాలు ఇలా ఉంటే అసలు పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నది ఇప్పుడు తెర‌ మీదకు వచ్చిన కీలక అంశం.

వైసిపి మాజీ నాయకుడు ప్రస్తుతం టిడిపిలో ఉన్న సీనియర్ రాజకీయ నేత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాజాగా ఆన్లైన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు. దీనిలో వైసిపి హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నేరుగా పార్టీకి భారీ స్థాయిలో ఫండ్ ఇచ్చిందని ఆయన చెప్పకు వచ్చారు. ఈ విషయాన్ని చెప్పడం ఇష్టం లేక జగన్ ఒకానొక సందర్భంలో తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని కూడా జాతుల నెహ్రూ వెల్లడించడం విశేషం.

అసెంబ్లీ సమావేశాల సమయంలో పోలవరం పై చర్చ జరిగినప్పుడు జగన్ బెంగుళూరు వెళ్లిపోయారని ఆ సమయంలో తనను పిలిచి పోలవరం ప్రాజెక్టుపై మీరు స్పందించాలని అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ఆయన సూచించినట్టు తెలిపారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను మొదటి నుంచి నిబద్దతగా ఉన్న నేపథ్యంలో టిడిపి అడిగిన ప్రశ్నలకు ముఖ్యంగా చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు తాను దీటుగా సమాధానం చెప్పానని అన్నారు.

కానీ తర్వాత కాలంలో చంద్రబాబు తనను పిలిచి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ వైసీపీకి ఇంత సొమ్ము ముట్ట చెప్పిందని ఆధారాలతో సహా చూపించేసరికి తన ఆశ్చర్యపోయానని జ్యోతుల తాజాగా వెల్లడించటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింతగా వైసిపిని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును ప్రాణప్రదంగా భావిస్తున్నామని చెప్పిన వైసీపీ ఈ ప్రాజెక్టులోనే అవినీతి ద్వారా సొమ్మును సంపాదించుకున్నది జ్యోతుల మాట. ఈ క్రమంలో ఏం జరుగుతుంది.. టిడిపి ఏ విధంగా దీనిని రాజకీయ అస్త్రంగా మలుచుకుని వైసీపీపై యుద్ధం చేస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి.

Related Post