ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకోకుండా ఎలా ఉంటాం.. అని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆలోచనలు చేస్తారని ప్రశంసలు గుప్పించారు. ‘భారత్ ఏఐ శక్తి’ పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం లో గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్తో ఏపీ సర్కారు కీలక ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. చంద్రబాబు దూరదృష్టికి ఇది నిదర్శనమని తెలిపా రు. ఏపీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుందన్నారు. ఏ రాష్ట్రానికీ లేని విధంగా తీర ప్రాంతం.. మౌలిక వనరులు కూడా ఈ రాష్ట్రానికి సొంతమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని.. పెట్టుబడులు ఆహ్వానించడంలో చంద్రబాబు ముందున్నారని తెలిపారు. ప్రస్తుత ఒప్పందం ద్వారా.. ఏటా ఆదాయం పెరగడంతోపాటు.. ఉపాధి ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ చిత్రాన్ని సాంకేతికతతో మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. “నన్ను ఆరు మాసాల కిందట మంత్రి నారా లోకేష్ కలిశారు. అప్పట్లోనే దీని గురించి చెప్పారు. సహకరించాలన్నారు. సాధారణంగా అనేక మంది మాకు ఈ ప్రతిపాదనలు చేస్తారు. కానీ, ఇంత వేగంగా చేస్తారని అనుకోలేదు. ఇది ఏపీ భవిష్యత్తుకు మాత్రమే కాదు.. వికసిత్ భారత్ సాకారానికి కూడా దోహదపడుతుంది” అని వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రస్తుతం ఏర్పడిన సంస్థ భవిష్యత్తులో అనేక రూపాల్లో ఏపీకి సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ ఒప్పందం ఒక మైలు రాయిగా మారుతుందని తెలిపారు. టెక్ ప్రపంచంలో ఏపీకి నేడు చరిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయం సృష్టించామన్నారు.