టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది హీరోలు, నిర్మాతలు మరే ఫ్యామిలీలోనూ లేరు. ఇప్పటికే ఆ కుటుంబంలో పలు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అల్లు అరవింద్ ఎప్పట్నుంచో గీతా ఆర్ట్స్ సంస్థను నడిపిస్తున్నారు. తర్వాత చిన్న, మిడ్ రేంజ్ సినిమాల కోసం జీఏ2 పిక్చర్స్ అంటూ కొత్త బేనర్ పెట్టారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఉన్నాయి. అంజనా ప్రొడక్షన్స్ నాగబాబుకు చెందిన పాత నిర్మాణ సంస్థ. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ నిహారిక పింక్ ఎలిఫెంట్ పేరుతో కొత్త బేనర్ పెట్టి సమర్థంగా నడిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్కేమో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్ ఉంది. ఇది కాక రామ్ చరణ్.. వీ మెగా సంస్థ పేరు మీద ది ఇండియా హౌస్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా ఇన్ని ప్రొడక్షన్స్ ఉన్న మెగా ఫ్యామిలీలో కొత్తగా ఇంకో బేనర్ పుట్టుకువస్తున్నట్లు సమాచారం. ఆ సంస్థ పేరు.. విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ అట. దీన్ని మొదలుపెడుతున్నది మెగాస్టార్ మేనల్లుడు, యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ అట. త్వరలోనే ఈ సంస్థలో ఒక సినిమా నిర్మితం కాబోతోందట. మరి అందులో తేజునే హీరోగా నటిస్తాడా.. లేక యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ సంస్థను పెట్టాడా అన్నది తెలియాల్సి ఉంది.
తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోనే కావడంతో తమకంటూ ఒక బేనర్ ఉండాలని అన్నయ్య భావిస్తున్నాడేమో. ప్రస్తుతం తేజు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డితో సంబరాల యేటిగట్టు అనే భారీ చిత్రం చేస్తున్నాడు. కొత్త దర్శకుడు కేపీ రోహిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సుదీర్ఘ కాలంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బడ్జెట్ సమస్యల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.