చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్’ షూటింగ్ మేఘాలయలో వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత వేణు దోనేపూడి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అక్టోబర్లో ప్రారంభమైన ఈ చిత్రంలో టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరిఅన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓ ఐ, కార్తికేయ దేవ్, కశ్యప్, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరిస్తున్న తొలి సినిమా ఇదే. ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా గన్స్, గోల్డ్, హంట్ చుట్టూ తిరుగుతుంది. ఆరుగురు పాత్రల మధ్య సాగే ఆసక్తికరమైన కథ ఇది.
వేణు దోనేపూడి మాట్లాడుతూ, “మేఘాలయలో పూర్తి స్థాయిలో షూట్ చేస్తున్న మొదటి సినిమా ఇది. కథ నార్త్ ఈస్ట్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి ఇక్కడే షూట్ చేస్తున్నాం. ఇక్కడి ప్రకృతి అందాలు, జలపాతాలు, కొండలు అన్నీ మా కథకు బాగా సరిపోయాయి” అని చెప్పారు.
ఎల్లప్పుడూ వర్షం పడే సోహ్రా (చిరపుంజి) ప్రాంతంలో సినిమా చిత్రీకరిస్తున్నారు. వర్షం కారణంగా షూటింగ్ కష్టంగా ఉన్నప్పటికీ, టీమ్ ఎంతో కృషి చేస్తోందని వేణు తెలిపారు. “ఇది ప్రేక్షకులకు కనువిందు చేసే సినిమా అవుతుంది” అని అన్నారు.
చిత్రాలయం స్టూడియోస్ మేఘాలయ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్ట్పై పనిచేస్తోంది. ఇటీవల మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా సినిమా టీమ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త దర్శకుడు గుణి మాచికంటిను పరిచయం చేస్తూ ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తోంది. అద్భుతమైన కథ, అందమైన లొకేషన్లు, యూనిట్ కృషి కలిసి ‘బా బా బ్లాక్ షీప్’ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.