ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీని ముగించింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 6,014 మంది ఎంపికయ్యారు. వీరిలో 5,757 మందిని శిక్షణకు ఎంపిక చేయగా, సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో 993 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండడం విశేషం.
ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచే శిక్షణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసు శాఖలో నూతనంగా చేరుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందజేయనున్నారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎంపికైన ఉద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న నియామక నోటిఫికేషన్లను పూర్తిచేసి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. కొద్ది నెలల క్రితం మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం, తాజాగా పోలీసు శాఖలో 6,104 ఖాళీలను భర్తీ చేసింది. రిక్రూట్మెంట్కు సంబంధించిన 31 రిట్ పిటిషన్లను న్యాయస్థానాల్లో పరిష్కరించి, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడంతో ఈ నియామక ప్రక్రియ విజయవంతమైందని ప్రభుత్వం పేర్కొంది.