ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత ఆ పార్టీకి బద్ధ శత్రువుగా మారిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదికే మారిన ఆయన.. తర్వాతి నాలుగేళ్లు ఆ పార్టీ మీద అలుపెరగని పోరాటం చేశారు. బదులుగా ఆయన మీద ఏదో కేసు పెట్టి హింసించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
కట్ చేస్తే ఇప్పుడు రఘురామ తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా గెలిచి శాసన సభ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తాడేపల్లిలో జగన్ నివాసానికి దగ్గర్లోనే.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెందిన ఇంట్లో ఉంటున్నారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు రఘురామ.
గతంలో విజయసాయి వైసీపీ అగ్రనేతల్లో ఒకరిగా ఉన్న సమయంలో.. రెబల్ ఎంపీ అయిన రఘురామను దారుణమైన బూతులు తిట్టారు. రఘురామ కూడా విజయసాయిని గట్టిగా టార్గెట్ చేశారు. ఐతే ఇప్పుడు విజయసాయి వైసీపీకి టాటా చెప్పి, రాజకీయాలకు దూరం అయిపోయారు.
తాను కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యాక.. ఎక్కడ నివాసం ఉండాలి అనుకున్నపుడు జగన్ ఇంటికి దగ్గర్లోనే విజయసాయికి చెందిన ఇల్లు అందుబాటులో ఉందని, దాన్ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నారని తెలిసిందని.. దీంతో ఆయన్ని సంప్రదించానని.. ఆయన సంతోషంగా తనకు ఇంటిని అద్దెకు ఇచ్చారని.. అలా అప్పట్నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నానని రఘురామ వెల్లడించారు.
గతంలో విజయసాయికి, తనకు ఉన్న వైరం గురించి మాట్లాడుతూ.. మొదట్లో ఈయనేంటి ఎంపీ అయి ఉండి ఇలా బూతులు మాట్లాడతారేంటి అనుకునేవాడినని.. కానీ ఆ ట్వీట్లు అన్నీ వేసేది ఆయన కాదని, జగన్ మనిషే ఆయన పేరు వాడుకుని బూతు ట్వీట్లు వేసేవారని తనకు తర్వాత తెలిసిందని..
అయినప్పటికీ ఆ ట్వీట్లు ఆయన పేరిటే చలామణి అవుతాయి కాబట్టి విజయసాయికే తాను సమాధానం ఇచ్చేవాడినని రఘురామ తెలిపారు. తమ మధ్య వ్యక్తిగతంగా గొడవేమీ లేదని.. విజయసాయి స్వతహాగా అంత దారుణమైన బూతులు మాట్లాడే, చిల్లర రాజకీయం చేసే వ్యక్తి కాదని రఘురామ అభిప్రాయపడ్డారు.