hyderabadupdates.com movies రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల కలకల

రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల కలకల

ఏపీ రాజధాని అమరావతి సమీపంలో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టుల కలకలం రేగింది. కేంద్ర బలగాలు సోదాలు చేపట్టి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.

అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్‌, గ్రేహండ్స్‌ బలగాలు కొత్త ఆటోనగర్‌ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేశారు. భవన యజమాని కోసం పోలీసుల ఆరా తీశారు. అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు తెలిసింది. పది రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామంటూ, అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Related Post