కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రాజ్ భవన్లకు పేరు మార్చింది. ఇక నుంచి రాజ్ భవన్లను `లోక్ భవన్`లుగా సంబోధించాలని.. అధికార, అనధికార జాబితాలు.. పత్రాలు.. సహా మీడియా కూడా ఇదే తరహాలో పేర్కొనాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
`రాజ్` అంటే అధికారిక అనే అర్థం ఉంది. అందుకే.. గవర్నర్లు నివసించే, కార్యాలయాలు ఉన్న భవనాలను రాజ్ భవన్లుగా .. గత ఏడు దశాబ్దాలకు పైగానే వ్యవహరిస్తున్నారు. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. వీటిని రాజ్ భవన్లుగా పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక స్థానంగా కూడా వీటికి గుర్తింపు ఉంది. సంబంధిత గవర్నర్ అక్కడే నివాసం ఉండడంతో పాటు.. కార్యకలాపాలను కూడా ఈ భవన్లోని కార్యాలయం నుంచే నిర్వహిస్తున్నారు. సువిశాలమైన ప్రాంగణాలు కూడా ఉంటాయి. ఆటస్థలం.. విందులు ఇచ్చేందుకు విశాలమైన వనాలతో కూడిన ఏర్పాట్లు, కారిడార్లువంటివి రాజ్భవన్ సొంతం.
అయితే.. గత కొన్నాళ్లుగా గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయి. ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. ఇటీవల సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. వాస్తవానికి ఈ వాదన.. 1950ల నుంచే ఉంది. గవర్నర్ బంగళాలను విశ్రాంతి నిలయాలుగా పేర్కొంటూ భోగరాజు పట్టాభిసీతారామయ్య(కాంగ్రెస్ అగ్రనేత) చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ.. గుర్తుకు వస్తాయి. అదేవిధంగా గవర్నర్లను తెల్ల ఏనుగులతోనూ పోల్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా… అనేక విమర్శలు ఎదుర్కొన్నా.. రాజ్యాంగం ప్రకారం వారికి ప్రత్యేక అధికారాలు.. గౌరవం దక్కుతాయి.
తాజాగా వారు నివసిస్తున్న భవనాలకు పేర్లు మార్చడం వెనుక.. `రాజ్` అనే పదం తీసేయడం వెనుక.. ప్రస్తుతం వస్తున్న విమర్శల నుంచి కొంత మేరకు బయటపడే వ్యూహం ఉండి ఉంటుందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, నుంచి అంటే.. ఈ గెజిట్ విడులైన తక్షణం.. రాజ్ భవన్ల పేరును లోక్భవన్లుగా మార్చనున్నారు. అదేవిధంగా మీడియా సహా అన్ని మాధ్యమాలూ.. లోక్భవన్ గానే సంబోధించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. మహారాష్ట్రలో ఇప్పటికే రాజభవన్ పేరును లోక్ భవన్గా మార్పు చేయడం గమనార్హం.