బాలీవుడ్లో ఒక సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్లు బయట కూడా చాలా సన్నిహితంగా మెలగడం.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే చర్చ జరిగేలా చేయడం.. తద్వారా సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేయడం.. ఒక కామన్ ప్రాక్టీసే. ఇలా చాలా సినిమాల విషయంలో జరిగింది. సినిమా మేకింగ్ దశలో మొదలయ్యే ఈ ఫేక్ రిలేషన్షిప్స్.. రిలీజయ్యే వరకే కొనసాగుతాయి. తర్వాత అంతా సద్దుమణిగిపోతుంది.
ఇప్పుడు టాలీవుడ్ జంట రామ్ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే.. ఇదే శైలిని అనుసరిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. వీళ్లిద్దరూ కలిసి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో నటించారు. ఈ సినిమా మేకింగ్ దశలోనే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే చర్చ మొదలైంది. ప్రేమలో పడ్డారని.. పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. సినిమా రిలీజ్ టైంకి ఈ ప్రచారం ఊపందుకుంది. ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడిన తీరు ఆ సందేహాలను ఇంకా పెంచింది.
ఐతే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం తమ మధ్య ఏమీ లేదని తేల్చేశారు రామ్, భాగ్యశ్రీ. కానీ ఈ జంట సోషల్ మీడియా పోస్టులు చూసినా.. యుఎస్ ప్రమోషనల్ టూర్లో వ్యవహరిస్తున్న తీరు చూసినా.. వీరి బంధం సినిమాను మించినదనే అనుమానాలు కొనసాగుతున్నాయి. యుఎస్ టూర్లో రామ్, భాగ్యశ్రీ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ మామూలుగా లేదు.
వ్యక్తిగత బంధం ఉంటే తప్ప ఇలాంటి కెమిస్ట్రీ సాధ్యం కాదని.. భాగ్యశ్రీ ఇంతకుముందు కలిసి నటించిన ఏ హీరోతోనూ ఇంత సన్నిహితంగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరి ఫొటోలు, వీడియోల కింద కామెంట్లు చూస్తే జనం వీరిని ఏ దృష్టితో చూస్తున్నారో అర్థమవుతుంది. ఐతే సినిమా ప్రమోషన్ కోసం సోషల్ మీడియాను కావాలనే ఈ జంట టీజ్ చేస్తోందని.. ఈ విషయంలో బాలీవుడ్ స్టైల్ను వీళ్లిద్దరూ ఫాలో అవుతున్నారని.. ‘ఆంధ్ర కింగ్’ సినిమా సందడి తగ్గాక ఇద్దరూ ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.