ప్రజా ప్రతినిధి…అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు ఎన్నుకున్న నేత. తమ నియోజకవర్గం నుంచి గెలిపించి శాసన సభకు పంపితే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి ఆ నేతకు ఓటేస్తారు. అసెంబ్లీలో కావచ్చు…బయట కావచ్చు…తమ ప్రాంత సమస్యలు తీరుస్తారని ప్రజలు నమ్మి వారిని గెలిపిస్తుంటారు. కానీ, చాలామంది ఎమ్మెల్యేలు గెలవగానే ప్రజల సమస్యలు పట్టించుకోవడం మానేస్తారు. ఇక, ఆ ఎమ్మెల్యే మంత్రి కూడా అయితే చాలా బిజీ అయిపోయి..ప్రజలతో చాలా గ్యాప్ వస్తుంది. ఇక, క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటే ఏపీ ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ వంటి నేతలకైతే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేంత తీరిక, ఓపిక ఉండే ఛాన్సే లేదు.
ఇలా అనుకునే వారంతా పప్పులో..తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఏపీలో పెట్టుబడుల వేటలో, వరుస విదేశీ పర్యటనలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు రూపొందించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మాత్రం లోకేశ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. లోకేశ్ ను కలిసేందుకు వచ్చిన జనంతో అక్కడ అర కిలోమీటర్ క్యూ లైన్ ఏర్పడింది.
లోకేశ్ దర్బార్ కు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించిన లోకేశ్…వాటిని చెత్తబుట్టలో పడేయకుండా సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సంబంధిత అధికారులను ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశిస్తుంటారు. అందుకే, లోకేశ్ దర్బార్ కు హాజరయ్యేందుకు మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా లోకేశ్ తమ సమస్యలు నేరుగా విని పరిష్కరించడంపై దర్బార్ కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఉంటే ఈ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న లోకేశ్..భవిష్యతులో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు మరింతమంది సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.