ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఆయన బీహార్ రాజధాని పాట్నాకు చేరుకున్న వెంటనే పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అదేసమయంలో ఎన్డీయే కూటమి పార్టీల కీలక నాయకులతోనూ ఆయన కలివిడిగా ముందుకు సాగారు. నిజానికి ఉత్తరాదినాయకులు.. ముఖ్యంగా బీహార్కు చెందిన నాయకులతో కలివిడి అంటే.. కొంత ఇబ్బందే. భాషా పరమైన సమస్య ఉంటుంది.
అయినా.. నారా లోకేష్ అటు ఇంగ్లీష్.. ఇటు హిందీల్లో దంచికొట్టారు. ఎక్కడా తడబాటు లేకుండా.. జాతీయ మీడియాతో ఇంగ్లీష్లోను.. స్థానిక బీహార్ మీడియాతో హిందీలోనూ మాట్లాడారు. ఇక, ఎన్డీయేకు చెందిన బీహార్ నాయకులతో ఆయన పూర్తిగా స్థానిక హిందీలోనే సంభాషించి ఆకట్టుకున్నారు. మరోవైపు.. ప్రచార పర్వంలో ఇప్పటి వరకు.. ఎన్డీయే అభ్యర్థులకు కూడా రాని థాట్ నారా లోకేష్కు రావడం గమనార్హం. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన నినాదం.. ఎన్నికల ప్రచారంలో వినిపిస్తుండడం విశేషం.
లోకేష్ ఏమన్నారంటే.. “ఏపీలో నమో సహకారంతో దూసుకుపోతున్నాం. డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఏపీలో నడుస్తోంది.“ అని వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా “బీహార్లో నాని.. సర్కారు రాకెట్ వేగంతో ముందుకు సాగుతోంది“ అని నారా లోకేష్ అన్నారు. దీంతో ఆయన పక్కనే కూర్చున్న బీహార్ బీజేపీ చీఫ్ సహా.. ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత నరసింహారావు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు `నమో` అంటే తెలుసు కానీ.. `నాని` అంటే ఏంటని మొహాలు చూసుకున్నారు.
ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. `నాని` అంటే ఏంటని అడిగారు. దీంతో నారా లోకేష్ చిరునవ్వు నవ్వి.. “నా అంటే.. నరేంద్ర మోడీ, ని అంటే .. నితీష్ కుమార్“ అని చెప్పడంతో అందరూ అచ్చరువొందారు. ఆ వెంటనే దీనిని ఎన్నికల స్లోగన్గా మారుస్తామని నరసింహారావు చెప్పారు. అంతేకాదు.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ నాయకుల వాట్సాప్ గ్రూపులో “ఫిర్ ఏక్ బార్ నానీ గవర్నమెంట్“ అనే నినాదం ఇవ్వాలంటూ.. పోస్టు చేయడం విశేషం. కాగా.. ఆదివారం(నవంబరు 9) సాయంత్రంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.