కోలీవుడ్లో అరంగేట్రానికి ముందే మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ.. తొలి సినిమా విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో బాగా ఇబ్బంది పడ్డ నటుడు ధ్రువ్ విక్రమ్. లెజెండరీ నటుడు విక్రమ్ తనయుడైన ఈ కుర్రాడిని అర్జున్ రెడ్డి రీమేక్ వర్మతో లాంచ్ చేయాలనుకున్నారు. కానీ సీనియర్ దర్శకుడు బాల తీసిన ఆ సినిమాపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ చిత్రాన్ని ట్రాష్లో పడేశారు.
మళ్లీ ఆదిత్య వర్మ పేరుతో అదే సినిమాను అర్జున్ రెడ్డి అసిస్టెండ్ డైరెక్టర్ గిరీశయ్యతో రీమేక్ చేయిస్తే.. అది ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ధ్రువ్ నటనకు పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. తర్వాత తన తండ్రి విక్రమ్తో కలిసి మహాన్ మూవీ చేశాడు. ఆ సినిమాలో ధ్రువ్ పాత్రకు, నటనకు మంచి పేరే వచ్చింది. కట్ చేస్తే తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు బైసన్ అనే సినిమాతో రాబోతున్నాడు. పరియేరుం పెరుమాల్, కర్ణన్, మామన్నన్, వాళై లాంటి గొప్ప సినిమాలు తీసిన మారి సెల్వరాజ్.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ప్రోమోలు గొప్పగా అనిపించాయి.
ఐతే దీపావళి కానుకగా ఈ నెల 17న బైసన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో ధ్రువ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తన తొలి రెండు చిత్రాలను ప్రేక్షకులు చూడకపోయినా. పర్వాలేదని.. కానీ బైసన్ మాత్రం కచ్చితంగా చూడాలని.. సినిమాల్లోకి ఇదే తన అసలైన ఎంట్రీ అని భావిస్తున్నానని ధ్రువ్ పేర్కొన్నాడు. ఈ కామెంట్లను చాలామంది తప్పుబడుతున్నారు.. ఇది ఆదిత్య వర్మ, మహాన్ సినిమాలను కించపరచడమే అంటున్నారు. అందులోనూ విక్రమ్తో కలిసి చేసిన మహాన్ను ఎలా తక్కువ చేసి మాట్లాడతాడు అంటూ ధ్రువ్ మీద విక్రమ్ ఫ్యాన్సే కొందరు నెగెటివ్గా స్పందిస్తున్నారు.
తన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో మీడియాకు ధ్రువ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తొలి సినిమా రీమేక్ కావడం, రెండో చిత్రంలో హీరో విక్రమ్ కావడం, పైగా అది ఓటీటీలో రిలీజ్ కావడంతో తాను అలా మాట్లాడాడని.. రెండేళ్ల పాటు కష్టపడి చేసిన సినిమా కావడం, నటుడిగా తన టాలెంట్ అంతటినీ బయటికి తీసిన చిత్రం కావడంతో బైసన్ మీద ఎక్కువ ప్రేమను చూపించానని.. ఆ రకంగా దీన్ని తొలి సినిమాగా భావించానని.. అంతే తప్ప తన తొలి రెండు చిత్రాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ధ్రువ్ స్పష్టం చేశాడు.