కేరళం(ఇటీవలే పేరు మార్చారు).. ప్రకృతి శోయగాలకు ఆలవాలమైన దేవుని భూమిగా పేరొందిన ఇక్కడ వచ్చే ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార పర్వానికి కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్ 9వ తేదీ ఇక్కడ పోలింగ్ జరగనుంది. సో.. ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి.? ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీ ఎలా ముందుకు సాగుతోంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
వాస్తవానికి.. కేరళంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారాన్ని మార్చే అలవాటు ఇక్కడి ఓటర్లకు సొంతం. అందుకే.. ప్రతి ఐదేళ్లకు ఈక్వేషన్లు మారుతుంటాయి. అయితే.. గత ఐదేళ్ల కిందట.. 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ సెంటిమెంటుకు బ్రేక్ ఇస్తూ.. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్.డీ.ఎఫ్. కూటమి విజయం దక్కించుకుంది. దీనికి ప్రధానంగా విజయన్ ఫేస్ వాల్యూతోపాటు.. సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న నాయకుడిగా ఆయనకు పేరు ఉండడమే కారణమని అంటారు.
మరి ఇప్పుడు మాటేంటి?
ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. విజయన్పై సీబీఐ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకువచ్చారన్న కేసు వెంటాడుతోంది. దీనికి తోడు.. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోవడం కూడా.. సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఇదిలావుంటే.. బీజేపీ ఇక్కడ పోరాటం ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను లోపాయికారీగా తనవైపు తిప్పుకొన్న కమలనాథులు.. అధికారంలోకి వచ్చేందుకు కాకపోయినా.. కింగ్ మేకర్గా ఎదగాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
తద్వారా.. పార్టీ పరంగా కీలకంగా మారాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్లో నేతల మధ్య వివాదాలు .. పార్టీని పలుచన చేస్తున్నాయి. తిరువనంతపురం ఎంపీ.. శశిథరూర్ ఎటు ఉంటారన్నదానిని బట్టి.. కాంగ్రెస్ పార్టీ విజయం లేదా.. సత్తా ఆధారపడి ఉందన్న చర్చ సాగుతోంది. ఇక, తాజాగా విజయన్.. దురంధ్ నియోజకవర్గం నుంచి వరుసగా తన పోటీని నిర్దేశించుకున్నారు. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా.. విజయన్ వర్సెస్ బీజేపీ మధ్య పోరుగానే ఎన్నికల పరిస్థితి మారిందని చెబుతున్నారు.
ఈ క్రమంలో విజయన్. ఎల్డీఎఫ్ కూటమిని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ, ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఈసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే.. ఇది తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా విజయన్ హవా తగ్గిందని చెబుతున్న కమల నాథులు.. కాంగ్రెస్ కూటమిని పలుచన చేయడం ద్వారా.. కింగ్ మేకర్గా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.