రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నప్పుడు దక్కినంత ప్రాధాన్యత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొరకదు. పవర్ లో ఉన్న పొలిటిషియన్స్ కు ప్రజలు మొదలు పారిశ్రామికవేత్తలకు వరకు అందరూ ఇచ్చే వ్యాల్యూనే వేరు. అయితే, ఈ ఫార్ములా కేవలం రాజకీయ నేతలకే కాదు…రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. 2024-25కు గానూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలే ఇందుకు నిదర్శనం.
టీఆర్ఎస్…ఆ తర్వాత బీఆర్ఎస్..పదేళ్లపాటు తెలంగాణలో పాలన కొనసాగించింది. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పదేళ్లపాటు నగదు రూపంలో అయితేనేమి, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అయితేనేమీ భారీగా విరాళాలు వచ్చాయి. బెల్లం చుట్టు ఈగలు అన్న రీతిలో అధికారంలో ఉన్నంత కాలం ‘గులాబీ’ పార్టీ విరాళాలను బాగానే రాబట్టుకోగలిగింది. 2023-24 కాలంలో దాదాపు 580 కోట్ల రూపాయల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయి.
కానీ, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మారిపోయింది. 2024-25కు గానూ ఆ పార్టీకి వచ్చిన విరాళాలు కేవలం 15.09 కోట్లు మాత్రమే అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ, అదే వాస్తవమని ఈసీకి ఆ పార్టీ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే విరాళాలు 97 శాతం తగ్గాయి. ఈ రేంజ్ లో విరాళాలు తగ్గడం శోచనీయం.
ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 5 కోట్లు, ఎస్.రాజేందర్ రెడ్డి ఇచ్చిన విరాళం 8.79 లక్షలు, అజార్ ఇచ్చిన విరాళం 29వేలు…వెరసి మొత్తం రూ.15.09 కోట్లు. విరాళాలు రాబట్టడంలో బీఆర్ఎస్ ఇలా డీలా పడడంతో గులాబీ నేతలు దిగాలుగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి పునర్వైభవాన్ని సంతరించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆ ఫలితాల తర్వాత అయినా ఆ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతాయేమో వేచి చూడాలి.