తిరుపతి : తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికల ద్వారా అమాయక భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం లోని తిరువల్లూరు జిల్లాకు చెందిన సి. సెంథిల్ కుమార్ (47 సంవత్సరాలు) ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో వాట్సాప్ , ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలలో త్వరితగతిన శ్రీవారి దర్శనం. అత్యంత సమీపంలో దర్శనం వంటి తప్పుడు ప్రకటనలతో భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ కేసులు నమోదు చేశారు పోలీసులు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల సబ్ డివిజన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. వీరికి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ప్రాంతంలో దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా “VIP దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి” అంటూ తప్పుడు ప్రచారం చేశాడు. అంతే కాకుండా టీటీడీ లోగోను దుర్వినియోగం చేసి భక్తులను నమ్మ బలికించడం . ఒక్కో టిక్కెట్కు సుమారు రూ. 16,500/- వసూలు చేయడం , కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, ఫోన్ పే ద్వారా డబ్బులు స్వీకరించడం, నకిలీ హామీలతో భక్తులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇతని వద్దనుండి ఒక డెల్ ల్యాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాలలో దర్శనం టిక్కెట్ల బుకింగ్కు సంబంధించిన డేటా, ఏఐ వీడియోలు, సోషల్ మీడియా చాట్ రికార్డులు లభించాయి.
ఇదిలా ఉండగా తిరుమల దర్శనం టిక్కెట్లు కేవలం అధికారిక TTD వెబ్సైట్ లేదా అనుమతించబడిన కౌంటర్ల ద్వారానే పొందాలని సూచించారు ఎస్పీ సుబ్బారాయుడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం ఉన్నప్పుడు సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.
The post శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్
Categories: