తిరుపతి : తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలోపుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి పరవశంలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని దర్శించారు . ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ కోదండ రామస్వామివారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకాలు చేశారు.
సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఊంజల్ మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా జరిగింది. తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ తదితర 12 రకాల పుష్పాలు, ఆరు రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామివారికి యాగం నిర్వహించారు . ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ పుష్పాలను భక్తి భావంతో విరాళంగా సమర్పించారు. పుష్పాల సుగంధంతో ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతి మాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.
బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
The post శ్రీ కోదండ రాముని మహోత్సవం దివ్య పుష్ప యాగం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
శ్రీ కోదండ రాముని మహోత్సవం దివ్య పుష్ప యాగం
Categories: