టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. గత కొన్నేళ్లలో విడాకులు, అనారోగ్య సమస్యలతో సతమతం అయిన ఆమె ఈ మధ్య చాలా హుషారుగా కనిపించడం తన అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ఇప్పుడామె మళ్ళీ పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం వారికి మరింత ఆనందాన్నిచ్చింది.
కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈషా ఫౌండేషన్లో వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలలుగా అక్కడికి తరచుగా వెళ్తున్న.. సమంత, రాజ్ అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు.
ఈ పెళ్లి సాధారణంగా జరిగింది కాదని.. దీనికి విశిష్టత ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.ఈషా యోగ కేంద్రంలోని లింగ భైరవి సన్నిధిలో.. సమంత, రాజ్ పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లిని యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారట.
ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతిక సంబంధానికి అతీతంగా.. దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియగా ఈ ‘భూత శుద్ధి వివాహం’ గురించి చెబుతున్నారు. లింగ భైరవి ఆలయాలు.. శుద్ధి చేసిన ప్రత్యేక ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ ప్రక్రియ వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందట. ఇలా పెళ్లి చేసుకున్న దంపతుల జీవితాల్లో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దైవానుగ్రహం పొందుతారట. సమంత, రాజ్ ఇద్దరికి ఇది రెండో వివాహం. ఏ కలతలు లేకుండా ఈ బంధం సాగిపోయేలా ఇద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.