పాకిస్థాన్ భారత్కు ఎప్పట్నుంచో శత్రు దేశమే కానీ.. ఈ ఏడాది జరిగిన పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి రెండూ బద్ధ శత్రు దేశాలుగా మారిపోయాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ నటీనటులు, టెక్నషియన్లు బాలీవుడ్ సినిమాల్లో పని చేయడం.. ఇక్కడి సినిమాలను పాకిస్థాన్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం ఇబ్బందిగా మారింది.
ఆ దేశంలో మాంచి ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుగా.. ఇటీవలి పరిణామాలతో ఈ కండల వీరుడికి పాకిస్థాన్లో మరింత కష్టం కాబోతోంది. ఆ దేశం సల్మాన్ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చారనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా సల్మాన్ మాట్లాడ్డమే అందుక్కారణం.
ఇటీవల ఒక అంతర్జాతీయ ఫోరంలో సల్మాన్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలకు విదేశాల్లో ఉన్న మార్కెట్ గురించి ప్రస్తావించాడు. అందులో భాగంగా పాకిస్థాన్తో పాటు బలూచిస్థాన్ పేరు వాడాడు. బలూచిస్థాన్ పాకిస్థాన్లో భాగమైన ఒక ప్రావిన్స్. ఐతే అక్కడి వాళ్లు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగానే ప్రకటించుకున్నారు. ఐతే సల్మాన్ దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా బలూచిస్థాన్ను ప్రత్యేక దేశం అన్నట్లుగా మాట్లాడాడు.ఇది పాకిస్థాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
సల్మాన్కు పాకిస్థాన్లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా అతను మాట్లాడ్డంతో అక్కడి వారికి మండిపోయింది. ఆల్రెడీ ఆ వ్యాఖ్యలకు సంబంధించి పాకిస్థానీలు సల్మాన్ మీద మండిపడుతుండగా.. ఇప్పుడు ఆ దేశం సల్మాన్ను టెర్రరిస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది ఇండియన్ సల్మాన్ ఫ్యాన్స్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సల్మాన్ చేసిన ఒక చిన్న కామెంట్కు అతడిపై ఉగ్రవాది ముద్ర వేయడం ఏంటని మండిపడుతున్నారు. బలూచిస్థాన్ విషయంలో పాకిస్థాన్ ఎంతలా ఉలిక్కిపడుతోందో చెప్పడానికి ఇది ఉదాహరణ అంటూ పాక్ తీరును ఎండగడుతున్నారు.