స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందికర అంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటు పంపించాలి. దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. లేకపోతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన దాదాపు 4 వేల కోట్ల రూపాయలకు పైగా గ్రామపంచాయతీ నిధులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితులు గ్రామీణ స్థాయిలో ఉన్న రాజకీయ వాతావరణం భిన్నంగా ఉంది.
అధికార పార్టీపై సానుకూలత ఉన్నప్పటికీ అది ఓటు బ్యాంకుగా మారుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత ఆర్టీసీ బస్సు వంటి పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా అనుకున్న స్థాయిలో మైలేజ్ అయితే రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల వర్షాలు, వరదలు, తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించాలని వారికి భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు పదేపదే చెప్పినప్పటికీ నాయకులు కదిలింది లేదు.
రైతులను కలుసుకున్నది లేదు. వారికి భరోసా కల్పించింది కూడా కనిపించడం లేదు. ఇది పైకి కనిపించినటువంటి పెద్ద విపత్తుగా పార్టీ భావిస్తోంది. ఈ పద్ధతి కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగులుతున్నది ఒక వాదన. దీంతో ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత హడావిడి చేసినప్పటికీ మళ్ళీ వెనక్కి తగ్గారు. కానీ, మరొకవైపు నాలుగు మాసాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
అలాగని ప్రత్యేక అధికారుల పాలనను తీసుకురావాలన్నా.. కేంద్రం ఒప్పుకోవడం లేదు. దీంతో నిధుల బెడద కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలన్న విషయంపై పార్టీ సందిగ్ధంలో పడింది. త్వరలోనే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గ్రామస్థాయిలో జరిగే ఎన్నికల్లో పార్టీల జెండాలు ఉండవు. పార్టీ నాయకుల ప్రమేయం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ, సంస్థాగతంగా వచ్చే ఎన్నికల నాటికి ఇది బలమైన మద్దతు కూడగట్టే అవకాశం ఉండడంతో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే.