ఏపీలో రోడ్డు ప్రమాదాల లెక్కలు టెర్రర్ పుట్టిస్తున్నాయి.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందారు. ఈ వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవే. 53 శాతం మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్ యాక్సిడెంట్లు ఉన్నాయి. రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉంది.
నెల్లూరు, తిరుపతి, పలనాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. వాస్తవానికి ఓవర్ స్పీడ్ కారణంగా 79 శాతం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3 శాతం, మద్యం, మొబైల్ ఫోన్ల కారణంగా 1 శాతం చొప్పున ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై 42 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారుల పై 21 శాతం మేర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో పై అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. వారికి సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతీ రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలన్నారు. అమిత వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ట్రాన్స్పోర్టు వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్చరికలు జారీ చేసినా అమిత వేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్ చేయాలన్నారు. జాతీయ రహదారుల పై ఉన్న 680 బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని సీఎం ఆదేశించారు.
స్లీపర్ బస్సులు వివిధ రాష్ట్రాల్లో వాహన పర్మిట్లపై కేంద్రానికి లేఖ రాయాలన్నారు. దీనిపై అధికారులు సమాధానం ఇస్తూ ఇప్పటి వరకూ అనధికారికంగా ఆల్టరేషన్ చేసిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉన్న 134 బస్సులను సీజ్ చేసినట్టు సీఎంకు తెలిపారు. పాఠశాలల బస్సుల్ని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు.
రవాణేతర వాహనాల్లో స్పీడ్ గవర్నెన్సు విధానంపై కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్టు తెలిపారు. రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యంత వేగంగా సమీపంలోని ఆస్పత్రులకు బాధితుల్ని తరలించేందుకు 108 అంబులెన్సులు, జాతీయ రహదారుల అంబులెన్స్ లను ఇంటిగ్రేట్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించే వారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలన్నారు.