“ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం పోతది.. పార్టీకి ఏం నష్టం వస్తది. అందుకే తేల్చుకునేటందుకు వచ్చా“ అంటూ.. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చడీచప్పుడు లేకుండానే ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో వాలిపోయారు. ఆయన ఢిల్లీకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాకపై ఎలాంటి సమాచారం లేదని తెలిసింది.
ఇప్పటికే.. రాజ్యసభ సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. మార్చి 5తో నామినేషన్ల ఘట్టం కూడా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఎవరి దారిలో వారు తమకు సీటు దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కోటాలో రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి ఇప్పటికే మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి ఖరారైందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈయనను గతంలో ఉపరాష్ట్రపతి పదవికి బరిలో నింపారు. ఆయన ఓడిపోయిన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనను పెద్దల సభకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, మరో సీటు వాస్తవానికి కాంగ్రెస్ నాయకుడిదే. జాతీయ నేత అభిషేక్ సింఘ్వీ తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీటు కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వీహెచ్ ఎవరికీ చెప్పకుండానే నేరుగా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరే తేల్చుకునేందుకు వెళ్లారు.
తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని గతంలోనే కోరానని వీహెచ్ తెలిపారు. పార్టీలో నమ్మకంగా ఉన్నానని.. పార్టీ కోసం అన్నీ వదులుకున్నానని చెప్పారు. గత పదేళ్ల నుంచి తనకు ఏ పదవి లేదన్నారు. తన మనసులో కోరికను సీఎం రేవంత్ కు కూడా చెప్పానన్నారు. ఎందుకైనా మంచిదన్నట్టుగా ఢిల్లీ పెద్దలను కలిసి వెళ్లేందుకు వచ్చానన్నారు. పార్టీ కోసం పనిచేసిన తనపై 16 కేసులు పెట్టారని బీఆర్ ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.