హమ్మయ్య.. లిక్కర్ టెండర్ల వ్యవహారం పూర్తయింది.. సర్కారుకు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కానీ, అసలు తంతు ఇప్పుడే స్టార్టయింది. ఈ వ్యవహారంపై లెక్కకు మిక్కిలిగా రెండు కారణాలతో హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు.. ఈ పిటిషన్లపై తాజాగా శనివారం హోరా హోరీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్నలు సంధించింది.
లిక్కర్ షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అసంబద్ధంగా నిర్వహించడంతోపాటు.. గడువును పదే పదే ఎందుకు పెంచారని.. నిలదీసింది. కానీ, ఈ విషయంపై సర్కారు వద్ద సమాధానం లేకపోవడం తో ప్రభుత్వం సమయం కోరింది. అదేవిధంగా ఒక్కొక్క దరఖాస్తుకు రూ.3 లక్షలను ఎందుకు విధించారని ప్రశ్నించినప్పుడు.. పొరుగు రాష్ట్రాల్లో ఇది రూ.5-10 లక్షల వరకు ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారంపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అయితే.. సర్కారుకు లభించిన ఊరట ఒక్కటే. ప్రస్తుతం ముగిసిన టెండర్ల ప్రక్రియపై స్టే విధించాలన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు కొట్టి వేసింది. టెండర్ల ప్రక్రియ అయిపోయింది కాబట్టి.. తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. అనంతర ప్రక్రియ, లైసెన్సీల గుర్తింపు , షాపుల కేటాయింపు వంటివి మాత్రం తాము ఇచ్చే తుదితీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లిక్కర్ టెండర్ల వ్యవహారం డోలాయమానంలో పడింది.
అనేక ప్రశ్నలు..
ఈ క్రమంలో పలు ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. హైకోర్టు తుది ఆదేశాలు ఎలా ఉంటాయి? ఒకవేళ రుసుమును తగ్గించే వెసులుబాటు ఉంటుందా?. అదేసమయంలో షాపుల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందా? అనేది ఆసక్తిగా మారాయి. ఏదేమైనా లిక్కర్ టెండర్ల వ్యవహారం మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది సర్కారుకు వచ్చే రాబడిపై ప్రభావం చూపించే ఛాన్స్ కనిస్తోందని అంటున్నారు పరిశీలకులు.