రేపల్లె నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై వైసీపీలో ఎడతెగని రచ్చ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాన్ని నిన్న మొన్నటి వరకు చూసిన మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరిపోయారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల నాటికి మోపిదేవి వెంకటరమణ వారసుడికి టికెట్ ఇవ్వాలని వైసిపి భావించింది. కానీ, ఆయన తన రాజ్యసభ ప్రభుత్వానికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. దీనిని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కొన్నాళ్లు ప్రయత్నం చేసిన తర్వాత అనూహ్యంగా గతంలో అంబటి రాంబాబు విజయం దక్కించుకున్న నేపథ్యంలో ఈ సీటును ఆయనకే ఇవ్వాలని నిర్ణయించారు.
అందుకే సత్తెనపల్లి నుంచి రేపల్లెకు మారాలని కూడా ప్రతిపాదించారు. దీనికి తొలి రోజుల్లో అంబటి ఒకే చెప్పినా.. అంతర్గత సర్వే చేయించుకున్న ఆయన తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదని గతంలో ఉన్నట్టుగా రేపల్లె రాజకీయాలు ఇప్పుడు లేవని కూడా ఆయన నిర్ణయించుకుని వెనక్కి తగ్గారు. ప్రస్తుతం టిడిపి హవా జోరుగా ఉంది. పైగా మంత్రి అనగాని సత్యప్రసాద్ హవా ఏమాత్రం తగ్గకపోవడంతో పాటు వైసిపి నుంచి కూడా మోపిదేవి వెంకటరమణ వంటి బలమైన నాయకుడు వచ్చి టిడిపిలో చేరడంతో ఆ బలం మరింత పుంజుకుంది.
ఈ నేపథ్యంలో అనవసరంగా పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో అంబటి తప్పు కొన్నారు. ఇక ఈ స్థానాన్ని చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజినీకి ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమెకు రేపల్లె బాగుంటుందన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉంది. కానీ, అంబటి రాంబాబు వద్దన్న సీటును తాను తీసుకోవడం ఏంటి అన్న ఉద్దేశంతో రజనీ కూడా రేపల్లెపై ఇష్టం చూపించడం లేదు.
పైగా పోటీ తీవ్రంగా ఉండడం, స్థానికంగా బలమైన నాయకుడిగా అనగాని సత్యప్రసాద్ వెళ్లూనుకుని ఉన్న నేపథ్యంలో రజనీ కూడా సాహసం చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆమె కూడా ఉంటే చిలకలూరిపేట లేకపోతే మొత్తంగా పోటీ నుంచి తప్పుకుంటాను అన్న ఉద్దేశంలో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. మరి ఏం చేస్తారు? ఏం జరుగుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే అంబటి వదిలేసిన సీటు నేను తీసుకోవడం ఏంటనేవాదనను రజనీ ప్రస్తావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.