ఐదేళ్ల కిందట నందమూరి బాలకృష్ణ కెరీర్ చాలా బ్యాడ్ ఫేజ్లో ఉండగా తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జట్టు కట్టాడు. వీరి కలయికలో అప్పటికే సింహా, లెజెండ్ లాంటి బ్లాక్బస్టర్లు రాగా.. మూడో సినిమా అఖండ వాటిని మించిన విజయం సాధించింది. బాలయ్య కెరీర్లో ఆ సమయానికి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆ తర్వాత బాలయ్య వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో హిట్లు కొట్టాడు. ఈ విజయాల ఊపులో అఖండ లాంటి బ్లాక్బస్టర్కు సీక్వెల్ చేస్తుండడంతో అఖండ-2పై అంచనాలు మామూలుగా లేవు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే బాలయ్య పుట్టిన రోజు నాడు చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అఖండ నుంచి బ్లాస్టింగ్ రోర్ పేరుతో టీజర్ లాంచ్ అయింది. ఇది చూసిన నందమూరి అభిమానులకు ఐదేళ్ల కిందటి అఖండ ఫస్ట్ రోర్ టీజరే గుర్తుకు వస్తోంది.
”అఖండ ఫస్ట్ రోర్లో ఒక విలన్ ముందు.. శీను గారు మీ నాన్న బాగున్నారా అనేదానికి శీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడు అనేదానికి చాలా తేడా ఉందిరా లమ్డీ కొడకా”.. అంటూ ఫెరోషియస్ డైలాగ్ చెప్పి ఆ తర్వాత రౌడీల మీద ప్రతాపం చూపిస్తాడు బాలయ్య. దానికి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. ఇప్పుడు అఖండ-2లో కూడా సేమ్ అదే టైపులో ఫెరోషియస్ వాయిస్తో డైలాగ్ పేల్చాడు బాలయ్య.
” సౌండు కంట్రోల్లో పెట్టుకో.. ఏ సౌండుకి నవ్వుతానో ఏ సౌండుకి నరుకుతానో నాకే తెలియదు కొడకా.. ఊహకు కూడా అందదు”.. ఇలా సాగింది డైలాగ్. అఖండతో పోలిస్తే బాలయ్య లుక్ మారింది. కొంచెం వయసు మళ్లిన లుక్లో కనిపించాడు. ఇక విజువల్స్ చాలా భారీగా కనిపిస్తున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్లోనూ డెసిబల్స్ పెరిగాయి. మొత్తంగా చూస్తే బ్లాస్టింగ్ రోర్ నందమూరి అభిమానులకు బాగానే కిక్ ఇచ్చేలా ఉంది.
ఇక ఈ టీజర్ ద్వారా డిసెంబరు 5న రిలీజ్ విషయంలో అధికారిక ముద్ర కూడా పడిపోయింది. టీజర్లో చివర్లో రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ఇక రాబోయే 40 రోజులు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గట్టిగాప్రమోట్ చేసి సినిమా భారీ లెవెల్లో రిలీజ్ చేయాలని టీం భావిస్తోంది.