ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కూడా తాను ప్రయాణంలోనే(ఆయన ఆస్ట్రేలియా వెళ్తున్నారు) దీపావళిని జరుపుకొంటున్నట్టు చెప్పారు. అయితే.. తన ప్రయాణం వెనుక ఏపీ ప్రయోజనాలు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల వేట ఉందన్నారు. దీనిని సాధించగలిగితే.. తెలుగు వారికే కాకుండా తనకు కూడా అదే అసలైన దీపావళి పండుగ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు చేశారు. నారా లోకేష్.. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. సుమారు వారం రోజుల పాటు ఆయన ఆదేశంలో ఉండనున్నారు.
ఈ సందర్భంగా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, ఆక్వా రంగానికి సంబంధించి అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. పెట్టుబడుల కోసం అన్వేషణ సాగిస్తున్న ఏపీ సర్కారుకు ఆస్ట్రేలియా నుంచి కూడా భారీ ఎత్తున పారిశ్రామిక వేత్తలను తీసుకువచ్చే అవకాశం ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. ‘స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రామ్’ కింద లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ ఏడు రోజుల్లోనూ ఆయన అనేక పనులు పెట్టుకున్నారు. ప్రవాస భారతీయులను కలుసుకుని.. వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న `పీ-4`లో వారిని భాగస్వామ్యం కావాలని కోరనున్నారు.
ఆస్ట్రేలియాలోని కీలక విశ్వ విద్యాలయాలు, యూనివర్సిటీలను సందర్శిస్తారు. ఆయా చోట్ల ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? విద్యార్థులను ఎలా ప్రోత్సహిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుని.. వాటిని ఏపీలోనూ ఇంప్లిమెంటు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇదే విషయాన్ని స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్.. ఏపీ విద్యార్థుల భవిష్యత్తు, వారికి ఉపాధి అందించే కోర్సుల విషయంపై తాను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. టాప్ కంపెనీల సీఈఓలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రులతో సమావేశం కాబోతున్నానని పేర్కొన్నారు.
ఇక, ఉభయ గోదావరి జిల్లాలకు కీలకమైన ఆక్వా రంగంలో ఇబ్బందులు వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ఈ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆక్వారంగాన్ని పరిశీలించి ఎగుమతులకు ఉన్న అవకాశాలపైనా అధ్యయనం చేయనున్నట్టు నారా లోకేష్ ప్రకటించారు. ఇక, సీఐఐ దిగ్గజాలతో భేటీ కానున్నారు. వీటి ద్వారా.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానున్నానని.. ఇదే జరిగితే.. రాష్ట్ర ప్రజలకు, తనకు కూడా అదే పెద్ద దీపావళి పండుగ అని పేర్కొన్నారు. కాగా.. గత ఏడాది దీపావళి సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో గూగుల్ ప్రతినిధులతో నారా లోకేష్భేటీ అయ్యారు.