hyderabadupdates.com movies అమరావతి రెండో దశ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలో తెలుసా

అమరావతి రెండో దశ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలో తెలుసా

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 33 వేల ఎకరాల భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించారు. ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు సమీకరించిన చరిత్రలేదని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇదిలావుండగా అమరావతిలోని అడవులు సహా ప్రభుత్వానికి మరో 20 వేల ఎకరాల భూమి ఉంది. దీంతో మొదటి దశలో 54 వేల ఎకరాలు అమరావతికి ఉన్నట్టయింది.

అయితే పెరుగుతున్న జనాభా, నగరాల విస్తీర్ణాన్ని శాసిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల క్రితం ఉన్న ప్లాన్‌ను రివైజ్ చేసుకున్న ప్రభుత్వం మరో 46 వేల ఎకరాల భూములను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులోనూ మరో 20 వేల ఎకరాలు ప్రభుత్వానికి చెందినవేనని అధికారులు చెబుతున్నారు. వీటిలో 10 వేల ఎకరాలు అటవీ ప్రాంతమని, దీనిని డీనోటిఫై చేయిస్తే అందుబాటులోకి వస్తుందని వెల్లడిస్తున్నారు. మొత్తంగా రెండో దశ అమరావతి విస్తరణలో ప్రభుత్వానికి కావాల్సింది కేవలం 26 వేల ఎకరాలే.

ఇందులోనూ రెండో దశలో 16,600 ఎకరాలను సేకరించనున్నారు. దీనిని సమీకరించేందుకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ తాజాగా జారీ చేశారు. తుళ్ళూరు, అమరావతి మండలాల్లోని ఆరు గ్రామాల నుంచి ఈ భూములను సేకరించనున్నారు. మలి దశలో మరో 10 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరిస్తారు.

తుళ్ళూరు మండలంలోని పెదపరిమి గ్రామంలో 6513.52 ఎకరాలు, వడ్లమనులో 1936.87 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2428.25 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తారు. అదేవిధంగా అమరావతి మండలంలోని వైకుంఠపురంలో 3361.48 ఎకరాలు, యండ్రాయిలో 2166.04 ఎకరాలు, కర్లపూడిలో 2944.10 ఎకరాలను సేకరించనున్నారు.

తలనొప్పులు రాకుండా…

రైతుల నుంచి రెండో దశలో సమీకరించే భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. సమీకరణకు రైతులు అంగీకరించినట్టు ముందే వారి నుంచి అనుమతి పత్రాలు తీసుకుని, ప్రభుత్వ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించనున్నారు.

అలాగే ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూములను సాగుకు అనుమతించకుండా నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో భూముల విషయంలో ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే అవకాశాలు లేకుండా, రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

Related Post