ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. రాజధాని ఒక మునిసిపాలిటీగా మిగిలిపోకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇచ్చిన 33 వేల ఎకరాల భూములకు తోడు మరొ 44 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించాలని యోచిస్తున్నామని, దీనికి రైతులు సహకరించాలని కోరారు. రైతుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత అభివృద్ధి సంఘం ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సంఘంలో రైతులు సభ్యులుగా చేరితే తమ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి ఇది గొప్ప వేదిక అవుతుందని అన్నారు. అమరావతి నిర్మాణంలో రైతులను భాగస్వామ్యం చేశామనీ గుర్తు చేశారు. రైతుల త్యాగాలను గౌరవిస్తూ వారికి మేలు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి కొందరు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు తీవ్రవనని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైతులు ఏ సమస్యతో వచ్చినా అధికారులు వారిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడైనా రైతుల నుంచి రూపాయి తీసుకున్నట్టు తెలిసినా సంబంధిత ఉద్యోగి, శాఖాధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా రైతులకు మరింత మేలు చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే నియమించిన త్రిసభ్య కమిటీ రైతుల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించనున్నట్లు పేర్కొన్నారు.
మూడు ప్రాంతాల అభివృద్ధి
ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాలను ఒకేసారి అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ప్రాంతంపైనా వివక్ష లేదని తెలిపారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దని చెప్పారు. విశాఖలో ఐటీ పరిశ్రమకు భారీ ప్రోత్సాహం ఇస్తున్నామని, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అమరావతితో పాటు విజయవాడ, కృష్ణా, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలను ఒకేసారి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందనీ, మూడు ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందనీ తెలిపారు.