మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు.. తొలిసారి ఇక్కడ నుంచి విజయం దక్కించుకోవడం కావొచ్చు.. మొత్తంగా మంగళగిరి అనగానే నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు మాత్రం మంగళగిరి అనగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. వరుస విజయాలకు తోడు.. ఆయన అనేక విషయాల్లో ముందు వరుసలో నిలబడ్డారు.
ముఖ్యంగా రాజధాని భూసమీకరణ నుంచి నిధుల వినియోగం.. అప్పుల వరకు.. కూడా ఆయన 2014-19 మధ్య వార్తల్లో నిలిచారు. ప్రపంచ బ్యాంకుకు రుణాలు ఇవ్వొద్దని లేఖలు రాయడంతోపాటు.. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో భూములు సమీకరించే విషయంలోనూ రైతులతో కలిసి యాగీ చేశారు.
ఇక, రాజధాని అమరావతికి వ్యతిరేకంగా కూడా ఆయన అనేక సందర్భాల్లో గళం వినిపించారు. అయితే.. 2024 ఎన్నికల ముందు.. ఆ తర్వాత ఆళ్ల చేసిన పనితో ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు.
ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ నాయకులు ఎవరు? అని ప్రశ్నిస్తే.. తడుముకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మాత్రం ఆళ్ల పేరు మార్మోగింది. ఏం జరిగినా.. ఆర్కే ముందుకు వచ్చేవారు. ఇక, గత ఎన్నికలకు ముందు.. వైసీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాతకొన్నాళ్లకే మళ్లీ వైసీపీ బాట పట్టారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక, అప్పటి నుంచి కూడా ఆళ్ల ప్రజా క్షేత్రంలో లేకుండా పోయారు. ఆయన చేపట్టిన సామాజిక కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి.
కేసుల భయం..?
ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డిబయటకు రాకపోవడం వెనుక.. వాయిస్ వినిపించకపోవడం వెనుక కేసుల భయం ఆయనను వెంటాడుతోందన్న చర్చ సాగుతోంది. వైసీపీ హయాంలో అమరావతిపై అనేక వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రపంచ బ్యాంకుకు రుణాలు ఇవ్వొద్దంటూ ఈమెయిళ్లు పంపారు.
ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అందుకే.. వాటికి భయపడి.. ఆళ్ల బయటకు రావడం లేదని ఒక టాక్ వినిపిస్తోంది. ఇదేసమయంలో పార్టీలో తనకు ప్రాధాన్యం లేనప్పుడు ఎందుకన్న భావనతోనూ ఆయన సైలెంట్ అయ్యారని మరో వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఏదేమైనా ఆళ్ల ఇప్పుడు కనిపించడం లేదు. ఆయన వాయిస్ వినిపించడం లేదు.