మాట పెళుసు.. మనిషి కరుకు.. అన్న పేరు తెచ్చుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. తనకు మంత్రి పదవి ఇవ్వాలని.. ఇస్తారని.. కానీ కొందరు అడ్డు పడుతున్నారని వ్యాఖ్యానిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ రాజా.. తనదైన శైలిలో విమర్శలు గుప్పి స్తున్న విషయం తెలిసిందే. అనేక సందర్భాల్లో ఆయన మంత్రి పీఠంపై అనేక వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి పదవులు ఇవ్వడం లేదా? నాకు ఇస్తే తప్పేంటని కూడా ప్రశ్నించారు.
అంతేకాదు.. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వారికి.. కొత్తగా గెలిచిన వారికి కూడా పదవులు ఇచ్చారని.. తనను మాత్రం దూరం పెట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లోనూ రాజగోపాల్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అసలు ఏ చట్ట సభకు ప్రాతినిధ్యం వహించని.. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. ఇక, కొన్నాళ్లుగా వెయిటింగ్ లిస్టు లో ఉన్న.. ప్రేమ్సాగర్రావు, సుదర్శన్రెడ్డికి కూడా.. నామినేటెడ్ పదవులు ఇచ్చి.. కేబినెట్ హోదా కల్పించారు.
కానీ, కావాలి.. కావాలి.. అంటూ.. మంత్రి పీఠం పై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. అయితే.. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. కొందరు రాజగోపాల్ విషయంలో సానుభూతి చూపిస్తే.. మరికొందరు.. ఆయన కొన్ని హద్దులు మీరారని వ్యాఖ్యానించారు. పదువులు కావాలని.. రావాలని కోరుకున్న నాయకులు కొంత వినయంతో ఉండాలని కొందరు సూచించారు.
మరికొందరు.. హెచ్చరించి, విమర్శలు చేస్తే.. పార్టీ అధిష్టానం సహించదని.. గతంలో అనేక అనుభవాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇంకొందరు.. సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే నని.. ఇప్పుడు పదవులు పొందిన వారుకూడా.. చాలా ఓపిక, సహనంతో వేచి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలనిచెబుతున్నారు. ఇలా.. రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి రాజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.