ఓ పక్క అమరావతి రాజధాని నిర్మాణ పనులు..మరో పక్క రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లో వేట..మరో పక్క సంక్షేమ పథకాల అమలుపై నేరుగా పర్యవేక్షణ…ఇలా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. అయినా సరే ప్రతి నెలా 1వ తేదీన సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంచుతున్నారు. అంతేకాదు, ఈ క్రమంలో వారేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అన్న విషయాన్ని స్వయంగాతెలుసుకుంటారు.
ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు తన ఎడతెరిపి లేని షెడ్యూల్ లో కూడా పెన్షన్ల పంపిణీ చేస్తుంటే…కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం లేదు. ఇలా, ఆ కార్యక్రమంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో 48 మంది ఎమ్మెల్యేలలు పాల్గొనడం లేదని సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది. ఈ క్రమంలోనే ఆ 48 మందిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని టీడీపీ ప్రోగ్రాం కమిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వారి వివరణ తీసుకున్న తర్వాత అవసరమైతే చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి ఏళ్ల తరబడి సేవ చేస్తూ విధేయులుగా ఉన్నవారిని, కష్టపడి పని చేసే కార్యకర్తలను కలుపుకుపోవాలని హితవు పలికారు.
ఇదే కాదు, ఓ పక్క చంద్రబాబు, మరో పక్క లోకేశ్ లు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుబడుతుంటే మరొక పక్క కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. దీంతో, వారి పంచాయతీలు తీర్చడం కోసం చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. వారిద్దరికీ సహకరించాల్సింది పోయి ఇలా తలనొప్పులు తెచ్చిపెడుతున్న నేతలపై తెలుగు తమ్ముళ్లు గరంగరంగా ఉన్నారు.