“ఇటీవలకాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అదృశ్య శక్తుల ప్రమేయం ఉంటోంది. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించా. కానీ, ఇది నిజం. అయితే.. ఆ శక్తులు ఎవరు? ఎలా వస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు.“ అని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) వ్యాఖ్యానించారు. తాజాగా ఆదివారం ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ 230 స్థానాల్లో పోటీ చేసింది. అయితే.. పీకే మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.
అయితే.. ఒక్క స్థానంలోనూ జన్ సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు.. డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. కానీ, ఓటు బ్యాంకు మాత్రం 3.35 శాతం వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ పరిణామాలతో పీకే గ్రాఫ్ డౌన్ అయింది. ఇతర పార్టీలకు వ్యూహకర్తగా ఉంటూ.. ఆయా పార్టీల విజయంలో తన భాగస్వామ్యం ఉందని చెప్పుకొనే పీకే.. తన సొంత పార్టీని విజయ తీరాలకు చేర్చుకోలేకపోయారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పీకే తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడు తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు.
అయితే.. అవేంటనేది మాత్రం తనకు అంతుచిక్కడం లేదని పీకే చెప్పడం గమనార్హం. అంతేకాదు..ఈవీఎంలపై అందరికీ ఉన్నట్టుగానే తనకు కూడా సందేహాలు ఉన్నాయన్న ఆయన.. కానీ, ఈ విషయంలోనూ నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు లేవని చెప్పారు. తాము ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చెప్పినా అతిశయోక్తిగా ఉంటుందని.. వివాదాలకు అవకాశం వస్తుందని అన్నారు. ఇక, బీహార్లో అసలు ముక్కు మొహం కూడా తెలియని పార్టీలు విజయం దక్కించుకున్నాయని ఆరోపించారు. ప్రజలకు వాటి సింబల్స్ కూడా తెలియవని అన్నారు. అయినప్పటికీ.. అవి విజయం సాధించడం ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు.
“మా పార్టీ పరంగా మేం బాగానే పనిచేశాం. ప్రజల నుంచి కూడా మంచి మద్దతు లభించింది. ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు ఘనంగా స్వాగతాలు పలికారు. మేం సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ.. కనీసం 50 స్థానాల్లో విజయం దక్కించుకుంటామని భావించాం. చివరి నిముషంలోనూ అంచనా వేసుకున్నాం. అప్పుడు 5-10 స్థానాల్లో గెలుపు ఖాయమని భావించాం. కానీ, ఏం జరిగిందో ఏమో.. ఇలా అయింది.“ అని పీకే వ్యాఖ్యానించారు. అలాగని ఎన్నికల వ్యవస్థను తాను తప్పుపట్టడం లేదన్నారు. జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే.. మాత్రం ఎక్కడో ఏదో తేడా జరుగుతోందన్నది వాస్తవమని తెలుస్తోందన్నారు. కానీ, దానిని గుర్తించడమే ఇప్పుడు పెద్ద టాస్క్గా మారిందని చెప్పారు.