ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శస్త్ర చికిత్స నిర్వహించారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఆయన ఆ రోజు అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా, ఎంఆర్ఐ స్కాన్ కూడా చేశారు. పరీక్షల నివేదికలను పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి, వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనట్లు సమాచారం.
అయితే పూర్తిస్థాయి కోలుకోడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీర్ఘకాలం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ వెల్లడించారు. జనసేన పార్టీ కార్యకలాపాలు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేపట్టాల్సిన పర్యటనలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అయితే పవన్ కల్యాణ్కు ఏ తరహా అనారోగ్యం వచ్చిందన్నది మాత్రం ఆయన టీం ప్రకటించలేదు.
ఐతే గతంలో పవన్ వెన్ను నొప్పితో బాధ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏం ఆర్ ఐ తీసింది కూడా దాని కారణంగానే అయ్యుండొచ్చని వార్త వినపడుతుంది. మరి అసలు సమస్య ఏమిటో అధికారికంగా తెలియాల్సి ఉంది.