బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకడైన, నవాబ్ల కుటుంబానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ మీద ఈ ఏడాది జనవరిలో జరిగిన దాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక్కడే సైఫ్ ఇంట్లోకి చొరబడి సైఫ్ మీద కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ వ్యక్తి రెండు రోజుల తర్వాత పోలీసులకు దొరికాడు. అర్ధరాత్రి వేళ జరిగిన దాడితో సైఫ్ కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందింది. ఆ సమయంలో ఒక ఆటోలో సైఫ్ను తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు.
కొన్ని రోజుల తర్వాత కోలుకుని సైఫ్ ఇంటికి వచ్చాడు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఐతే ఈ ఘటన గురించి ఆ సమయంలో పెద్దగా మాట్లాడని సైఫ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన తెచ్చాడు. అప్పుడు తనపై జరిగిన దాడిని కూడా కొందరు ఫేక్ అంటూ రాయడం తనను చాలా బాధ పెట్టిందని సైఫ్ చెప్పాడు. అభిమానులు కంగారు పడకూడదని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తాను నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లడాన్ని అనుమానంగా చూసి, తప్పుడు వార్తలు సృష్టించారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
‘‘డిశ్చార్జ్ అయ్యాక నేను ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాను. నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లడం పెద్ద సంచలనం అయిపోయింది. మీడియా వాళ్లంతా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో అంబులెన్స్ లేదా వీల్ ఛైర్లో బయటికి వస్తే.. నాకు తీవ్ర గాయాలయ్యాయని శ్రేయోభిలాషులు, అభిమానులు ఆందోళన చెందుతారు. అందుకే నొప్పిగా ఉన్నప్పటికీ నడుచుకుంటూ వచ్చాను. నేను బాగానే ఉన్నానని వాళ్లందరికీ చెప్పడానికి అంతకంటే మార్గం కనిపించలేదు. కానీ దాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నాపై దాడే జరగలేదని.. అది అంతా నాటకమని రాసేశారు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం’’ అంటూ సైఫ్ అసహనం వ్యక్తం చేశాడు.