నిర్మాత దిల్ రాజు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న భారీ బడ్జెట్ మూవీ ఎల్లమ్మ. బలగం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి రెండు పట్టు వదలని విక్రమార్కుడిలా దీని కోసమే కష్టపడుతున్నాడు. ముందు న్యాచురల్ స్టార్ నానికి నచ్చింది. కానీ డేట్లు ఇవ్వలేని పరిస్థితి. తర్వాత నితిన్ ఎంటరయ్యాడు. వరస డిజాస్టర్లు ప్రాజెక్టుకి స్పీడ్ బ్రేకర్స్ గా మారాయి. తర్వాత ఒకరిద్దరు తమిళ హీరోల దగ్గరకు వెళ్ళింది. కానీ రకరకాల కారణాల వల్ల వెంటనే ఎవరూ ఎస్ చెప్పలేదు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ని కలిశారనే టాక్ వచ్చింది కానీ అది నిజమో కాదో తేలకుండానే గాల్లో కలిసిపోయింది. ఇప్పుడో ఊహించని పేరు తెరమీదకొచ్చింది.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ ఎల్లమ్మని తీయాలని దాదాపు ఫిక్స్ అయినట్టు లేటెస్ట్ అప్డేట్. అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు కానీ త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉండొచ్చు. దేవిని హీరోగా మార్చాలని గతంలో పలువురు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత దేవి మనసు మారడం ఆశ్చర్యం. స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉండే దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య గుబురు గెడ్డం బాగా పెంచాడు. బహుశా అది ఎల్లమ్మ కోసమేననే అనుమానాలు బలపడుతున్నాయి. హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకున్నట్టు వచ్చిన లీక్ నిజమో కాదో ఇంకొద్దిరోజుల్లో తేలనుంది.
ఇన్ని చేతులు మారిన ఎల్లమ్మ ఎట్టకేలకు అనుకోని గమ్యస్థానం చేరుకుంది. గతంలో ఇదే తరహాలో వివి వినాయక్ హీరోగా దిల్ రాజు శీనయ్య అనే సినిమా మొదలుపెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. తర్వాత అది ఆగిపోయింది. ఎల్లమ్మకు అలా జరగకుంటే చాలు. కాకపోతే దిల్ రాజు చెప్పిన ప్రకారం ఎల్లమ్మకు భారీ ఖర్చు కావాలి. కానీ దేవి మీద అంత మార్కెట్ కాదు కనీసం కనీసం బేసిక్ కూడా లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ ఉండటం వేరు, నటుడిగా జనాన్ని థియేటర్లకు రప్పించడం వేరు. మరి ఈ ఛాలెంజ్ ని వేణు ఎలా తీసుకుని మెప్పిస్తాడో చూడాలి. అధికారిక ముద్ర వచ్చే వరకు అనుమానంగానే చూడాలి సుమా.