ప్రతి ఏటా ఐపీఎల్ సీజన్ మొదలయ్యే ముందు మ్యాచ్ల కంటే ఎక్కువగా మారుమోగేది ‘వేలం పాట’. ఏ ప్లేయర్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడు? ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసింది? అనే ఉత్కంఠ కోట్లాది మంది ఫ్యాన్స్లో ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెట్ లీగ్గా ఎదిగిన ఐపీఎల్, ఇంకా ఈ పాతకాలపు వేలం పద్ధతినే నమ్ముకోవడం వెనుక అర్థం లేదని విమర్శలు వస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్, రెండుసార్లు ఐపీఎల్ విన్నర్ రాబిన్ ఉతప్ప బీసీసీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ కాదని, అది ఎప్పుడో పరిణతి చెందిందని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. అయినా సరే బీసీసీఐ ఇంకా పాత పద్ధతులనే పట్టుకుని వేలాడటం ఆశ్చర్యంగా ఉందన్నాడు. తక్షణమే ఈ వేలం పాటను రద్దు చేసి, దానికి బదులుగా అంతర్జాతీయ క్రీడల్లో (ఎన్బీఏ, ఫుట్బాల్ లీగ్స్) ఉండే ‘డ్రాఫ్ట్ సిస్టమ్’ను ప్రవేశపెట్టాలని సూచించాడు. ఏడాది పొడవునా ‘ట్రేడ్ విండో’ (ప్లేయర్ల మార్పిడి) తెరిచి ఉంచాలని డిమాండ్ చేశాడు. ప్లేయర్లను అంగడి సరుకులా వేలం వేయడం కంటే, జట్ల అవసరాలకు తగ్గట్టు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలన్నది ఆయన వాదన.
కేవలం టీవీ రేటింగ్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వేలం నిర్వహిస్తున్నారని ఉతప్ప మండిపడ్డాడు. నిజానికి డ్రాఫ్ట్ సిస్టమ్ కూడా టీవీలో అంతే ఆసక్తిని రేకెత్తిస్తుందని, పైగా దీనివల్ల ఫ్యాన్స్ తమ అభిమాన జట్ల పట్ల మరింత లాయల్టీని పెంచుకుంటారని ఆయన విశ్లేషించాడు.
ఉతప్ప చెప్పినట్లుగానే, వేలానికి ముందే జరిగిన ఒక భారీ ట్రేడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరాడు. దీనికి ప్రతిఫలంగా రవీంద్ర జడేజా మరియు సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్ వైపు వెళ్లారు. రూ. 18 కోట్లతో సంజు సీఎస్కేకి వెళ్తే, జడేజా (రూ. 14 కోట్లు), కరన్ (రూ. 2.4 కోట్లు) రాజస్థాన్ జెర్సీ వేసుకోనున్నారు.
ఇక డిసెంబర్ 16న అబుదాబిలో జరగబోయే వేలం కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ, ఉతప్ప చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ స్థాయి లీగ్ అని చెప్పుకుంటున్నప్పుడు, ఆ స్థాయికి తగ్గట్టు నిబంధనలు మార్చుకోవాల్సిన అవసరం బీసీసీఐకి ఎంతైనా ఉంది. మరి ఈ సూచనలను బోర్డు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.