మన దగ్గర వందల కోట్ల బడ్జెట్ ఉండొచ్చు. ఇండస్ట్రీ మొత్తం మద్దతు ఇచ్చే బలం ఉండొచ్చు. కానీ కొన్ని చిన్న విషయాలు చిరాకు పెట్టడమే కాదు ఏకంగా భయపెట్టేలా చేస్తాయి. రాజమౌళి మాటలు వింటే ఇదే అనిపిస్తుంది. వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ లో ట్రైలర్ ప్లే చేసే సమయంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు జక్కన్నను బాగా ఇబ్బంది పెట్టాయి. ఆ అసహనం మాటల్లో కనిపించింది కూడా. టెక్నికల్ గ్లిట్జ్ వల్ల పదే పదే వీడియో స్ట్రక్ అవ్వడంతో రెండుమూడు సార్లు అంతరాయం కలిగింది. చివరికి విజయవంతంగా లాంచ్ చేశారు. కానీ ఈ ప్రసహనమంతా జరగడానికి అరగంట దాకా లేట్ అయ్యింది.
గెస్టులు, ప్రపంచం దేశం నలుమూలల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు, అభిమానులు, జనాలు మధ్య ఇలా జరిగితే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రాజమౌళి అయినా దానికి మినహాయింపు కాదు. దీనికి అంతా ఒక డ్రోన్ కారణమంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అసలేం జరిగిదంటే వారణాసి ఈవెంట్ ముందు రోజు రాత్రి రెండు గంటల సమయంలో ట్రైలర్ లో టెస్ట్ ప్లే చేద్దామని జక్కన్న టీమ్ రెడీ అయ్యింది. కొన్ని సెకండ్లు ప్లే కాగానే ఒక డ్రోన్ అక్కడ చక్కర్లు కొడుతూ వీడియో షూట్ చేయడం గమనించిన రాజమౌళి వెంటనే ప్రదర్శన ఆపేశారు. అప్పటికీ కొంత భాగం ఆ డ్రోన్ చిత్రీకరించేసింది.
లీకైతే ఈవెంట్ కు వచ్చే వాళ్ళ అనుభూతి చెడిపోతుందని అందుకే టెస్ట్ ప్లే రద్దు చేసుకున్నానని, కాబట్టే ఇప్పుడీ సాంకేతిక సమస్య వచ్చిందని రాజమౌళి ఇదంతా పూసగుచ్చినట్టు వివరించారు. లీకవుతుందనే భయాన్ని దాచుకోకుండా జక్కన్న బయట పెట్టడం చూస్తే పైరసీ తీవ్రత సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వందలాది జనాల కష్టం, వేల గంటల శ్రమ ఇలా చేయడం వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతుంది. రాజమౌళి ఆవేదన ఇదే. కాకపోతే చౌర్యం తప్ప నైతిక విలువలకు అర్థం తెలియని కొందరు మూర్ఖుల వల్ల రాజమౌళి లాంటి గ్రేట్ ఫిలిం మేకర్స్ సైతం కష్టాలు పడాల్సి వస్తోంది.