దేశంలో అతిపెద్ద పురాతన పార్టీగా కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఒకరకంగా చెప్పాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఆ పార్టీ పరిస్థితి మారింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కేవలం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం దక్కించుకుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం కంటే స్థానికంగా ఉన్న నాయకుల ప్రభావంతోనే పార్టీ విజయం దక్కించుకున్న వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడింది. కనీసం గతంలో జరిగిన ఎన్నికల్లో దక్కించుకున్న స్థానాలను కూడా ఇప్పుడు దక్కించుకోలేకపోయింది. ఇక వచ్చే ఏడాది కీలకమైన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే ఆరు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్కు పెద్ద బలం లేనటువంటి రాష్ట్రాలనే చెప్పాలి. తమిళనాడులో డిఎంకే, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్నాయి.
ఇవి రెండు ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలే అయినప్పటికీ కాంగ్రెస్తో కలిసి రాష్ట్ర స్థాయిలో పోటీకి మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తులపై క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేలమట్టం కావడంతో పాటు రాహుల్ గాంధీ ప్రభావం ఎక్కడ కనిపించకపోవడంతో తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉండి అధికారం కొనసాగిస్తున్న డీఎంకే, తృణమూల్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేయడం ఖాయం.
దీంతో కాంగ్రెస్ పార్టీ మరింతగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు రాజ్యసభలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఇంతో బలం ఉంది. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల అనంతరం అసెంబ్లీ పరంగా చూసుకుంటే బిజెపి నాయకుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో ఆ రాష్ట్రం నుంచి మెజారిటీ రాజ్యసభ స్థానాలన్నీ బిజెపి ఖాతాలోకి రానున్నాయి. దీంతో రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది.
పార్లమెంట్లో ఇప్పటికే బొటాబొటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న చిన్నాచితక పార్టీలు కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయన్న ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఎలా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవడం మాట ఎలా ఉన్నప్పటికీ మరింతగా దిగజారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది అన్నది జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుంది పార్టీని ఎలా కాపాడుకుంటారు అనేది చూడాలి.