‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి. ‘కాంతార: చాప్టర్-1’ రిలీజ్ కావడానికి ముందే అతను తెలుగులో ‘జై హనుమాన్’, హిందీలో ఛత్రపతి శివాజీ బయోపిక్ లాంటి మెగా మూవీస్లో హీరోగా ఎంపికయ్యాడు. ఇక తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్-1’కు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఐతే ఏదో ప్రీక్వెల్ హైప్ను క్యాష్ చేసుకుందామని కాకుండా.. ఈ సినిమా కోసం అతను ఎంత కష్టప్డడాడో, ఎంత తపనతో సినిమా తీశాడో బిగ్ స్క్రీన్ మీద ఆ చిత్రాన్ని చూస్తున్నపుడే ప్రేక్షకులకు అర్థమైంది.
రిలీజ్ ముంగిట పెద్దగా ప్రమోషన్లు చేయకపోతే ఏంటో అనుకున్నారు కానీ.. మంచి సినిమా తీస్తే జనాలే దాన్ని తమ భుజాల మీద మోస్తారనే ధీమా రిషబ్ది అని స్పష్టమైంది. అసలెలా తీశారు అనిపించేలా ఫిలిం మేకర్స్ను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి ఇందులో సన్నివేశాలు. ద్వితీయార్ధంలో క్లైమాక్స్ సహా కొన్ని ఎపిసోడ్ల మేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
నటుడిగా, దర్శకుడిగా సమాన స్థాయిలో అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చాడు రిషబ్. క్లైమాక్స్ కోసం అతనెలా ఒళ్లు హూనం చేసుకున్నాడో చెప్పడానికి అతను సోషల్ మీడియాలో పెట్టిన తాజా పోస్టే నిదర్శనం. క్లైమాక్స్ చిత్రీకరణ సందర్భంగా సెట్లో తన కాళ్ల తాలూకు ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు రిషబ్. కాళ్లు వాచిపోయి, రంగు మారిపోయి భయపెట్టేలా ఉన్నాయి.
బొగ్గు గనుల్లో పని చేసే కూలీల కాళ్లు ఇవి అంటే నమ్మేస్తాం. ఒక స్టార్ హీరో కమ్ డైరెక్టర్కు ఇంత కష్టం పడాల్సిన అవసరం లేదు. కానీ సినిమా కోసం రిషబ్ ఎంతలా ప్రాణం పెట్టేస్తాడో చెప్పడానికి ఈ ఫొటోలు రుజువుగా ఉన్నాయి. ఇంత కష్టపడి, తపనతో సినిమా తీశాడు కాబట్టే ప్రేక్షకులు కూడా ‘కాంతార: చాప్టర్-1’ను అంతలా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రెండో ఆదివారం ఈ సినిమా ఒక కొత్త చిత్రంలా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.