ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు వేగంగా పెరుగుతోంది. వాస్తవానికి శనివారమే ఏడు కీలక పరిశ్రమలకు చంద్రబాబు వర్చువల్గా శ్రీకారం చుట్టారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులు రానున్నాయి. స్థానికంగా 10 వేల మందికి పైగా యువత, మహిళలకు ఉపాధి లభించనుంది.
మరోవైపు తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ ఫోన్ల సంస్థ యాపిల్ కూడా కుప్పంలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఐఫోన్ కంపెనీ ఛాసిస్ తయారీకి సంబంధించిన భారీ ఫ్యాక్టరీని కుప్పంలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇటీవలి చర్చలు కూడా పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
దీనికి తోడు, ఇతర రాష్ట్రాలకు కుప్పం చేరువగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు 120 కిలోమీటర్లు, చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో కుప్పం ఉండడంతో ఇక్కడ ఛాసిస్ తయారీ యూనిట్ను నెలకొల్పడం ద్వారా మేలు జరుగుతుందని యాపిల్ భావిస్తోంది.
దీనికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం యాపిల్ ఫోన్లలో వినియోగించే హైగ్రేడ్ అల్యూమినియం ముడి పదార్థం చిత్తూరు జిల్లా నుంచే ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ తయారు చేస్తున్నారు. అలా కాకుండా కుప్పంలోనే తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల పొరుగు మెట్రో నగరాల్లోని మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, కుప్పంలో యాపిల్ ఫోన్ల ఛాసిస్ తయారీ యూనిట్కు సంబంధించిన కమర్షియల్ ఆపరేషన్స్ 2027 మార్చిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల స్థానికంగా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇక లాజిస్టిక్స్, సేవలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో భారీగా అనుబంధ ఉపాధి కూడా పెరుగుతుంది.